అమరావతి ఎంపికకు కారణమిదే, బాధను దింగమింగి మహానాడులో మంత్రి నారాయణ
కుమారుడు చనిపోయిన బాధను మనసులోనే దిగమింగుకొని అమరావతిలో రాజధానిని ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సిందనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి. నారాయణ మహానాడులో వివరించారు.
అమరావతి: కుమారుడు చనిపోయిన బాధను మనసులోనే దిగమింగుకొని అమరావతిలో రాజధానిని ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సిందనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి. నారాయణ మహానాడులో వివరించారు.
ఇటీవలనే రోడ్డు ప్రమాదంలో మంత్రి నారాయణ తనయుడు నిషిత్ మరణించాడు. మహానాడును పురస్కరించుకొని నారాయణ విశాఖ చేరుకొన్నారు.రాష్ట్ర రాజధాని కోసం అమరావతిని ఎందుకు ఎంపిక చేయాల్సివచ్చిందనే విషయమై ఆయన మహానాడులో సుదీర్ఘంగా ప్రసంగించారు.
రాజధాని ఏర్పాటు కోసం అనేక ప్రాంతాలను పరిశీలించినట్టుగా నారాయణ చెప్పారు. అమరావతి ప్రాంతం రాజధానికి అనువైన ప్రాంతంగా గుర్తించినట్టు ఆయన చెప్పారు. అయితే అమరావతిలో రాజధాని రావడం ఇష్టంలేని వైఎస్ జగన్ నానా భీభత్సం చేశాడని ఆయన ఆరోపించారు.
అయితే చంద్రబాబుపై నమ్మకంతో వేలాదిమంది రైతులు తమ భూములను స్వచ్చందంగా ఇచ్చారని చెప్పారు. ఈ భూములను ఇచ్చిన రైతులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజధాని నగరానికి తుదిరూపునిచ్చే డిజైన్లు ఇప్పటికే సిద్దమయ్యాయని చెప్పారు.
రాజధాని అంటే సెక్రటేరియట్, అసెంబ్లీలతో పాటు రానున్న ఐదారేళ్ళలో లక్షలాదిమంది నివసించే ప్రజా అమరావతి రూపుదిద్దుకొంటోందన్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడమే లక్ష్యంగా చంద్రబాబు సాగిస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నారాయణ కోరారు.
అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు త్వరలో రాజధానికి రానున్నాయని నారాయణ చెప్పారు.అయితే నారాయణ ప్రసంగం సుదీర్ఘమౌతోందదని భావించిన చంద్రబాబునాయుడు ఉపన్యాసాన్ని త్వరగా పూర్తిచేయాలని కోరారు.