ఏపీ సీఎం జగన్ మౌనం వెనక వ్యూహం ఏంటి..? అమరావతిలో రాజధాని ఉన్నట్టా.. లేనట్టా..?
అమరావతి/హైదరాబాద్ : మంత్రి బొత్స సత్యనారాయణ వాడి వేడి వ్యాఖ్యలు చేస్తారు.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి అబ్బే అలాంటిది ఏమీ లేదంటారు. బీజేపి ఎంపీ సుజనా చౌదరి అసలు అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ కు ఎప్పరూ పాల్పడలేదని చెప్పుకొస్తారు. అన్ని కులాలున్న అమరావతిని కేవలం కమ్మరావతిగా చూస్తారా అంటూ సూటిగా ప్రశ్నిస్తారు టీడిపి మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరో ఆరోపణ చేస్తారు. లోకేష్ మరేదో ట్వీట్ చేస్తారు. ఇంతమంది అమరావతి రాజధాని నిర్మాణం గురించి స్పందిస్తున్నారు. అసలు సీఎం హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నారు..? అసలు రాజధానిని అమరావతి నుండి మార్చేద్దామనుకుంటున్నారా..? అందరూ అనుకుంటున్నట్టుగా దొనకొండకు తరలిస్తారా..? అనే ఆలోచనలు ఏపి నేతలతో పాటు ప్రజలను తొలుస్తున్న ప్రశ్నలు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక్కటంటే ఒక్క వ్యాఖ్య చేయడం లేదు. సీఎం మౌనం వెనక ఏదైనా మతలబు ఉంద అనే సందేహాలు కలుగుతున్నాయి.
రాజధాని నిర్మాణంపై సందిగ్దత..! సీఎం నిశ్శబ్దం వ్యూహాత్మకమా..?
ఏపిలోని 13 జిల్లాల్లో చాలామందికి అమరావతిని రాజధాని చేయటం ఇష్టముందా లేదా అనే అంశం ఆసక్తిగా మారింది. చంద్రబాబు నాయుడు సీఎంగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ప్రజలు సై అన్నారా లేక ఇష్టంగానే సరే అన్నాకా అర్ధం కాని పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ ఏపి సీఎంగా రాగానే మార్చేద్దామని అనుకోవటం రాజకీయపరమైన నిర్ణయమా అనే అంశం పై కూడా సందేహాలు నెలకొన్నాయి. కానీ వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందనే ముందు చూపులేకుండా మళ్లీ రెడ్డి వచ్చి మొదలుపెట్టి నట్టుగా మరోసారి రాజధాని అన్వేషణకు కొత్త ప్రదేశాల వైపు చూడటమే ఇప్పుడు చర్చకు అసలు కారణం. రాజధాని సమీక్షా సమావేశంలో టీడీపీ హయాంలో 32 వేల కోట్ల రూపాయల విలువైన టెండర్లను రద్దు చేస్తున్నట్టు జగన్ ప్రకటించాడు. మరి అమరావతి అంటే చూద్దాం అనలేదు.. మారుద్దామని చెప్పలేదు. కానీ జగన్ మనసులో ఏదో ఉందనేది మాత్రం ప్రజలకు అర్థమవుతోంది.
ఆరోపణలు-ప్రత్యారోపణలతో అట్టుకుతున్న ఆంధ్ర..! అగ్గికి ఆజ్యం పోస్తున్న బొత్సా వ్యాఖ్యలు..!!
అదే ఏమిటనేది మాత్రం అంతుబట్టకుండా ఉంది. కానీ ప్రజల్లో మాత్రం రాజధాని మార్పు పక్కా అనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికిప్పుడు తరలింపు జరిగితే కోట్లాదిరూపాయల ప్రజాధనం గాలికి వదిలేసినట్టుగానే విశ్లేషకులు భావిస్తున్నారు. తన మనసులో మాటను జనం ఎలా స్వీకరిస్తారనే అంశంపై స్పందన తెలుసుకునేందుకు మంత్రి బొత్సతో కథ నడుపుతున్నారనే వాదనకు జగన్ మౌనం బలాన్నిస్తోంది. అదే సమయంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ, బొత్స టీడీపీ మాజీ నేతలను గురించి చేసిన కామెంట్స్ కూడా కలకలం రేకెత్తిస్తున్నాయి. దీనికి స్పందించిన సుజనా చౌదరి కూడా, కేవలం తన ఇంటి పేర్లతో ఉన్న ఆస్తులను తమవిగా చూపటం ఘోరమంటూ ఆవేదన వెలిబుచ్చారు. పరవునష్టం దావా వేసేందుకు తమ లాయర్లతో చర్చిస్తున్నట్టు చెప్పారు. ఇంతమంది ఇన్ని రకాలుగా రాజధాని అంశాన్ని చర్చనీయాంశంగా మార్చారు. ఐనప్పటికి సీఎం స్పందించకపోవడం విశేషం.
అయోమయ ప్రకటనలు ఎందుకు..? ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన పవన్ కళ్యాణ్..!!
ఇదిలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధాని మార్పుఅంటూ సాగుతున్న చర్చపై స్పష్టత ఇవ్వాలని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. రాజధాని నిర్మాణాలు పరిశీలించిన పవన్ కళ్యాణ్, అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజాధనంతో ఇన్ని నిర్మాణాలు జరుగుతుండగా రాజధాని మార్చాలనే ఆలోచన సబబు కాదన్నారు. ప్రజల్ని గందరగోళపరచేందుకే ప్రభుత్వంలో ఉన్నవారు రాజధానిపై ప్రకటనలు చేస్తున్నారని, రాజు మారితే రాజధాని మారాలా అని ప్రశ్నించారు. రాజధాని మార్చాలని నిర్ణయిస్తే ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ల దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
జరిగిన రచ్చ చాలు.. జనాలు విసిగిపోయారు..! జగన్ స్పందించాలంటున్న గబ్బర్ సింగ్..!!
ఇంకా నాలుగు రాజధానులు, ప్రకాశం జిల్లాకు తరలిస్తాం లాంటి స్టేట్మెంట్స్ తో ప్రజల్లో ఆందోళన, అశాంతి నెలకొంటోందన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని సూచించారు. గతంలో, తాను కూడా రైతులు నుంచి బలవంతంగా భూములు లాక్కోవద్దని పోరాడాను తప్ప అమరావతిలో రాజధాని వద్దు అనలేదన్న విషయాన్ని గుర్తుచేసారు. ఒక సామాజిక వర్గానికి చెందిన రాజధాని అని కామెంట్స్ చేస్తున్నారని కాని ఇక్కడ 14 సామాజిక వర్గాల వారు భూములు ఇచ్చారని గబ్బర్ సింగ్ గుర్తుచేశారు. రైతుల త్యాగాలు వృథా పోనీయమనీ, వారికి జనసేన అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. ఇప్పటికైనా సీఎం జగన్ నోరు తెరిచి జరిగిని వివాదానికి తెరదించాలని డిమాండ్ చేస్తున్నారు.