ఏటా జరుపుకొంటాం కానీ.. 21 ఏళ్లుగా ఏం సాధించాం?: పవన్ కల్యాణ్
ఉద్దానం కిడ్నీ సమస్యపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. మార్చి 9న ‘కిడ్నీ డే’జరుపుకొంటున్న తరుణంలో ఉద్దానం నుంచి ఈ వ్యాధిని కూకటివేళ్లతో పెకలించివేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అమరావతి: యేటా మార్చి నెల 9వ తేదీన ప్రపంచ కిడ్నీ నివారణ దినంగా జరుపుకొంటుంటామని, గత 21 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నా కూడా ఏం సాధించామని జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్ ప్రశ్నించారు.
గత జనవరి 4న పవన్ స్వయంగా ఉద్దానం వెళ్లి కిడ్నీ బాధితులను పరామర్శించిన సంగతి విదితమే. ఆయన పర్యటనతో సమస్య తీవ్రత ఏమిటో సర్కారుకు అర్థమైంది. దాంతో రాష్ట్ర మంత్రులు, కేంద్ర బృందం ఈ ప్రాంతంలో పర్యటించడం, ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ఇంత తీవ్రంగా ప్రబలడానికి గల కారణాలపై ఆరా తీయడం అన్నీ వరుసగా జరిగిపోయాయి.
ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఎందుకు వ్యాపిస్తోందో కారణాలు తెలసుకొంటే వ్యాధిని నివారించే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు ఈ వ్యాధి ప్రబలడానికి కారణాలను మాత్రం కనుక్కోలేకపోయారు. అయితే శాస్త్రీయంగా ఈ విషయాన్ని కనుక్కోనే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో జనసేన అధినేత మరోసారి ఈ సమస్యపై స్పందించారు. ఈసారి మార్చి 9న ఈ 'కిడ్నీ డే' జరుపుకొంటున్న తరుణంలో ఉద్దానం నుంచి ఈ వ్యాధిని కూకటివేళ్లతో పెకలించివేయాలని ఆయన పిలుపునిచ్చారు. మళ్లీ వచ్చే మార్చి నాటికి ఉద్దాన ప్రాంతం ఆరోగ్యంతో కళకళలాడాలని పవన్ ఆకాంక్షించారు.
అయితే ఇందుకు సాదాసీదా చర్యలు సరిపోవని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం పవన్ కల్యాణ్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఉద్దానం ప్రాంతంలోని 120 గ్రామాల్లో 50 వేల మంది మూత్రపిండాల సమస్యలతో మంచానపడ్డారని, ఎందరో విగత జీవులు అయ్యారని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా కనిగిరిలోనూ ఇలాంటి పరిస్థితే ఉందని, తమకు వచ్చిన రోగానికి కారణం ఏమిటో కూడా తెలియక అమాయక జనం ఓ పక్క.. కారణం తెలిసినా చేష్టలుడిగిన ప్రజాప్రతినిధులు మరోపక్క ఉన్నారని ఆయన తెలిపారు.
రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు నెలకు రూ.8 వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని పవన్ కల్యాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు సర్కారు స్పందించిందని, యుద్ధప్రాతిపదికన ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఈ వ్యాధిపై దాడి చేయాలని, అవసరమైతే ఇందుకు అంతర్జాతీయ సహకారం కూడా తీసుకోవాలని ఆయన సూచించారు.