Analysis:అమరావతిలో వైసీపీ గెలిచినట్లా..ఓడినట్లా: టీడీపీ..జనసేనకు ట్రాప్ : అక్కడే బోల్తా పడ్డారు..!
అమరావతి: వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయం కోరుకుంటున్న అధికార వైసీపీ ముందు నుండి వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తోంది. అందులో భాగంగా..అమరావతి నుండి రాజధాని తరలింపు అంశం రాష్ట్రంలోనే కాకుండా..జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారింది. అనేక విమర్శలకు కారణమవుతోంది. అమరావతి అంశాన్నే టీడీపీ..జనసేన..బీజేపీ ప్రభుత్వం పైన ప్రచారాస్త్రంగా మలచుకుంటున్నాయి. అక్కడ సహజంగానే ఎన్నికల ఫలితాలు వైసీపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని..ముందుగానే అధికార పార్టీ అంచనాకు వచ్చింది.
అంతే, అమరావతి గ్రామాలను కలిసి అమరావతి కార్పోరేషన్ గా అప్ గ్రేడ్ చేయాలనే ప్రతిపాదనతో రాజధాని పరిధిలోని గ్రామాల్లో ఎన్నికలు లేకుండా చేయగలిగింది. అయితే, ఈ ఎత్తుగడ అర్దమవుతున్నా అడుకోవటంలో ప్రతిపక్షాలు విఫలమయ్యా యి. అసలు స్థానిక సంస్థల ఎన్నికల మీద పెద్దగా ఫోకస్ చేయని ప్రతిపక్షాలు..ఇప్పుడు తేరుకొనే లోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంతకీ అమరావతిలో వైసీపీ గెలిచినట్లుగా..ఓడినట్లా..
రాజధాని గ్రామాల్లో ఎన్నికలు నిలిపివేత
అమరావతి పరిధిలోని గ్రామాల్లో మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అమరావతి గ్రామాల పరిధిలో ఎన్నికల ఫలి తాలు ఎలా ఉంటాయనేది ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఇక, ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయంలో..దీని పైన ఎన్నికల సంఘం సైతం స్పష్టత ఇవ్వలేదు. అయితే, రాజధాని అమరావతి పరిధిలోని యర్రబాలెం, బేతపూడి, నవులూరు గ్రామాలను మంగళగిరి మున్సిపాలిటీలోకి విలీనం చేస్తూ ఇటీవలే జీవో జారీ చేశారు. పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లి మునిసిపాలిటీలో కలిపారు. దీనిపై రాజధాని రైతులు హైకోర్టులో సవాలు చేశారు. నిడమర్రు, కురగల్లు, కృష్ణాయపాలెం, నీరుకొండతో పాటు తుళ్లూరు మండలంలోని అన్ని గ్రామాలను కలిపి అమరావతి మెట్రోపాలిటన్ కార్పొరేషన్ ఏర్పాటును ప్రతిపాదించారు. దీంతో ఆ మండలంలోనూ ఎన్నికలు నిర్వహించొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించారనే విషయం వెలుగులోకి వచ్చింది.
వైసీపీ ఓడిందా..గెలిచిందా..
రాజధాని గ్రామాల్లో ఎన్నికలు కారణం ఏదైనా వాయిదా పడ్డాయి. అక్కడ ఎన్నికలు జరిగితే అధికా పార్టీకి ప్రతికూలంగా ఫలితాలు ఉంటాయనే విశ్లేషణలు వినిపించాయి. అయితే, వైసీపీ ఆ రిస్క్ తీసుకోదలచుకోలేదు. అమరావతి రాజధాని అయినా..గ్రామంగానే కొనసాగుతుందని..దానిని కార్పోరేషన్ గా అప్ గ్రేడ్ చేసేందుకే ఈ ప్రతిపాదనలు పంపామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఎన్నికల్లో ప్రతిపక్షా లకు అవకాశం ఇవ్వకుండా ముందస్తు వ్యూహంతోనే ప్రభుత్వం అక్కడ పై చేయి సాధించింది. అయితే, అక్కడ రాజకీయంగా కలిసి వచ్చే పరిస్థితి లేకపోవటంతోనే కార్పోరేషన్ గా ప్రతిపాదనను అడ్డుపెట్టుకొని ఎన్నికలు వాయిదా వేసారనేది ప్రతిపక్షాల విమర్శ.
వైసీపీ వ్యూహం
ఇదే సమయంలో అమరావతికి అండగా నిలుస్తామని చెప్పిన టీడీపీ..జనసేన..బీజేపీ లు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని అంచనా వేయలేక పోయారు. అసలు స్థానిక ఎన్నికలు రిజర్వేషన్ల వివాదం కారణంగా జరిగే అవకాశం లేదనే అంచనాల్లోనే కాలం గడిపేసారు. ప్రభుత్వం కార్పోరేషన్ గా అప్ గ్రేడ్ ప్రతిపాదనలను అడ్డుకుంటే...అక్కడ డెవలప్ మెంట్ ను అడ్డుకుంటున్నారనే ప్రచారం తెర మీదకు తెచ్చేందుకు వైసీపీ సిద్దమైంది. దీంతో..ప్రభుత్వ ట్రాప్ లో ప్రతిపక్షాలు చిక్కుకోవటంతో అక్కడ అనుకున్న విధంగా వైసీపీ తమ నిర్ణయాన్ని అమలు చేస్తోంది.
Recommended Video
వైసీపీ ట్రాప్ లో ప్రతిపక్షాలు...
ఇప్పుడు అమరావతిలో ఎన్నికలు లేకపోవటంతో..ప్రతిపక్ష పార్టీలు ఎక్కడా మూడు రాజధానుల అంశం పైన ప్రచారం చేసే అవకాశాలు అమరావతి పరిధిలోని మున్సిపాల్టీలకే పరిమితం అయింది. ఇదే సమయంలో అమరావతి పరిధిలోని మున్సిపాల్టీల్లో మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తే..అవి ఖచ్చితంగా గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో వారికి ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ గ్రేటర్ విశాఖ గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇదే సమయంలో జనసేన..బీజేపీ సైతం గ్రామీణ ప్రాంతాల్లో కంటే..అర్బన్ ప్రాంతంలో తమకు పట్టు దొరుకుతుందని అంచనా వేస్తోంది. మొత్తంగా..అధికార పక్ష వ్యూహాలను స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో పసి గట్టటం..అంచనా వేయటంలో ప్రతిపక్షాలు విఫలమైనట్లు కనిపిస్తోంది. అమరావతిలో ఎన్నికలు తప్పించుకొని నైతికంగా వైసీపీ ఓడిందనే వాదన వినిపిస్తున్నా.. రాజకీయంగా మాత్రం ప్రతిపక్షాల పైన గెలిచిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.