రిషికేశ్వరి డైరీలో ర్యాగింగ్ చేసిన ఐదుగురి పేర్లు: వాటిని కొట్టేసి 'మిస్టర్ ఎక్స్' అని రాసిందెవరు?
హైదరాబాద్: గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న బీటెక్ ఆర్కిటెక్చర్ విద్యార్ధిని రిషికేశ్వరి ఘటనలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. చనిపోయే ముందు తన డైరీలో రిషికేశ్వరి తన డైరీలో సూసైడ్ నోట్ను రాసింది. అయితే ఇప్పుడు ఈ సూసైడ్ నోట్పై వివాదం నెలకొంది.
యూనివర్సిటీలో తాను ఎదుర్కొన్న ర్యాగింగ్ పరిస్ధితులను కూడా రిషికేశ్వరి ఆ డైరీలో రాసుకున్నట్లు తెలుస్తోంది. రిషికేశ్వరి తన సూసైడ్ నోట్ను మొత్తం ఐదు పేజీల్లో రాసింది. అయితే ఆ ఐదు పేజీల్లోని ఓ పేజీలో ఐదుగురు విద్యార్థుల పేర్లున్నాయి.
రిషికేశ్వరి బ్లూ ఇంక్తో రాసిన పేర్లను బ్లూ ఇంక్ తోనే కొట్టేసి ఉండటం, వాటిపై రెడ్ ఇంక్తో ‘మిస్టర్ ఎక్స్' అని రాసి ఉండటం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. తనను ర్యాంగింగ్ చేసిన వారి పేర్లను తానే స్వయంగా రాసిన రిషికేశ్వరి వాటిని కొట్టివేసి ఉంటే ‘మిస్టర్ ఎక్స్' అనే పేరును రెడ్ ఇంక్ తో ఎందుకు రాస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రిషికేశ్వరి చనిపోయిన తర్వాత ఆమె గదిలోకి ఎవరో ఒకరు వెళ్లి ఉంటారని, వారే ఈ పనికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రిషికేశ్వరి రాసినట్లుగా భావిస్తున్న డైరీని పోలీసులు ఇప్పటిదాకా తమకు కూడా చూపించలేదని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
రిషికేశ్వరి డైరీ పేజీలు బయటకు ఎలా వచ్చాయంటే?
రిషికేశ్వరి డైరీలో రాసుకున్న పేజీలంటూ బయటకి వచ్చిన ఇంగ్లీషులో ఉన్న రెండు పేజీలు, పోలీసుల ఆధీనంలో ఉన్న డైరీలోని పేజీలు బయటికి రావడంతో విచారణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న డైరీలోని పేజీలు బయటకు లీక్ కావడంపై కేసు విచారిస్తున్న పోలీసులపై ఉన్నతాధికారుల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
పోలీసుల ఆధీనంలో ఉన్న రిషికేశ్వరి డైరీ వివరాలను మంగళగిరి డీఎస్పీ రామకృష్ణ మీడియాకు లీక్ చేయడంపై ఉన్నతాధికారులు అతినిపై మండిపడినట్లు తెలుస్తోంది. డైరీ వివరాలను మీడియాకు లీక్ చేయడంపై వివరణ ఇవ్వాలంటూ ఉన్నతాధికారులు డీఎస్పీని ఆదేశించించారు.
పది రోజుల సెలవుల అనంతరం నాగార్జున యూనివర్సిటీలో బుధవారం నుంచి తరగతులు పున:ప్రారంభమవుతాయి. ఈనేపథ్యంలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, మీడియాకు సూసైడ్ నోట్ ఇవ్వడం వెనుక గుంటూరుకు చెందిన వైసీపీ నేత హస్తం ఉన్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది.