క్లిష్ట సమయంలో ఏంటి మీ రాజకీయం..? విజయసాయి రెడ్డికి పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న..!
అమరావతి/హైదరాబాద్ : కరోనా మహమ్మారి కరతాళ నృత్యం చేస్తూ సభ్యదేశాలను కబళించి వేస్తూ, బారత దేశంలో విస్తరిస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండి ప్రజల ప్రణాలను కాపాడిల్సిన తరుణంలో రాజకీయాలకు పాల్పడడం ఎంతవరకు సంమంజసమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీ నేతలనుద్దేశించి సూటిగా ప్రశ్నించారు. గత మూడు నాలుగు రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ బీజేపి అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ, వైయస్సార్సీపి ఎంపి విజయసాయి రెడ్డికి మద్య జరుగుతున్న రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలపై పవన్ కళ్యాణ్ స్పందించారు.
ఏపి నేతల తీరుపై జనసైనికుడు ఆగ్రహం..
దేశంలోని అన్ని రాష్ట్రాలు కరోనా వైరస్ మహమ్మారితో వేడెక్కుతుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రాజకీయ ఆరోపణలతో వేడెక్కుతోంది. కరోనా వల్ల కలిగే విపత్తు పట్ల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అధికార పార్టీ నేతలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా విమర్శించారు.ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణపై కంటే రాజకీయ ప్రత్యర్థులపైనా కొందరు అధికార పార్టీ పెద్దలు దృష్టి పెట్టినట్లు గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలియచేస్తున్నాయని పవన్ ధ్వజమెత్తారు. ప్రపంచాన్ని క్రమక్రమంగా ఆక్రమిస్తున్న కరోనా కారణంగా అగ్రరాజ్యాలుగా చేష్టలుడిగి చిగురుటాకుల్లా వణికిపోతున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు.
రాజకీయ ఆరోపణలకు ఇదా సమయం..
కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. అన్ని వసతులూ ఉన్న అగ్రరాజ్య ఆసుపత్రులు రోగులందరికీ సేవలు అందించలేక నానా అవస్థలు పడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భారత దేశం పైన ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని పవన్ విష్లేశిస్తున్నారు. ఇక మన దేశంలో లక్షలాదిమంది కార్మికులు ముఖ్యంగా వలస కార్మికులు ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారన్నారు పవన్. రైతులు తమ పంటను అమ్ముకునే దారి లేక వృదాగా నేల పాలు చేస్తున్నారని పవన్ ఆందోళన వ్యక్తం చేసారు.
కరోనా కష్ట కాలంలో ప్రజలకు అండగా ఉండాలి..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ లో సైతం విజృంబిస్తోందని జనసైనికుడు ఆవేదన వ్యక్తం చేసారు. కేసులు పెరుగుతున్న తీరుచూస్తే ఈ మహమ్మారి ఎప్పటికి శాంతిస్తోందో ఊహకు అందడం లేదని పవన్ తెలిపారు. గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల ప్రజలు పెరుగుతున్న పాజిటివ్ కేసులు చూసి భయభ్రాంతులకు గురవుతున్నారని, ప్రపంచం అంతా ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దిగజారుడు రాజకీయాలకు నేతలు పాల్పడుతున్నారని, ప్రస్తుత తరుణంలో ఇలాంటి రాజకీయాలు అవసరమా అని ఆయన ప్రశ్నించారు.
Recommended Video
దిగజారుడు రాజకీయాలు వద్దు..
అత్యవసర వైద్య సేవలు అందించవలసిన తరుణంలో రాజకీయాలను భుజాలకు ఎత్తుకున్నార ఎంపీ విజయసాయి రెడ్డి పై మండిపడ్డారు పవన్ కళ్యాణ్. బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలకు ఇది సమయమా అని పవన్ ప్రశ్నించారు. ఆపత్కాల సమయంలో జనసేన పార్టీ అందరినీ కోరుతున్నది ఒక్కటేనని, కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయేంత వరకూ రాజకీయాలను పక్కన పెట్టాలని పవన్ పిలుపునిచ్చారు. దిగజారుడు రాజకీయాలకు దూరంగా ఉండి, ప్రజల సంక్షేమం కోసం శ్రమిద్దామని పవన్ అన్నారు. కరోనా వైరస్ విపత్కర సమయంలోనైనా రాజకీయాలు ఆపకపోతే ప్రజలు ఛీత్కరించుకునే పరిస్థితులు తలెత్తుతాయని అధికార పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ హితవు పలికారు.