టిడిపికి ఎన్ని సీట్లు, పవన్ కళ్యాణ్ మాటేమిటి: జగన్కు ప్రశాంత్ కిషోర్ సర్వే షాక్?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ షాకిచ్చే నివేదికను ఇచ్చారా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ షాకిచ్చే నివేదికను ఇచ్చారా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
చదవండి: పవన్ కల్యాణ్ పార్టీలోకి రోజా!? సర్వే ప్రభావం, జగన్ తో అంతరం, నాగబాబు సహకారం!
2014 ఎన్నికల్లో బిజెపికి, బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్కు పని చేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏపీలో వైసిపికి పని చేస్తున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో వైసిపి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.
రూ.8.5 కోట్లతో సర్వే
ఇటీవల ప్రశాంత్ కిషోర్ ఏపీలో ఓ రహస్య సర్వే నిర్వహించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు రూ.8.5 కోట్లు ఖర్చయ్యాయనే వాదనలు వినిపిస్తున్నాయి. 175 నియోజవకవర్గాల్లో సర్వే చేసినట్లుగా తెలుస్తోంది. కేవలం అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే చేశారని, పార్లమెంటు నియోజకవర్గాల్లో సర్వే చేయలేదని తెలుస్తోంది.
వందలాది శాంపిల్స్.. సర్వేలో టిడిపిదే గెలుపని..
మే 17వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు ఇరవై ప్రశ్నలతో మొత్తం 500 సాంపిల్స్ను ప్రశాంత్ కిషోర్ సేకరించారని తెలుస్తోంది. ఈ సర్వేలో తెలుగుదేశం పార్టీదే గెలుపు అని తేలిందని సమాచారం. ఇదే ఎమ్మెల్యేలతో ఎన్నికలు జరిగితే టిడిపికి ఎక్కువ సీట్లు వస్తాయని తేలిందని అంటున్నారు. వైసిపి ఎమ్మెల్యేలను, ఇంచార్జిలను మారిస్తే ఎన్ని సీట్లు వస్తాయని కూడా ప్రశాంత్ కిషోర్ సర్వే చేసినట్లుగా తెలుస్తోంది.
సర్వే లెక్కలో.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఓట్లు అంటే..
ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలో.. టిడిపికి 114 సీట్లు వస్తాయని, 41 శాతం ఓట్లు పడతాయని తేలిందని తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 49 సీట్లు, 27 శాతం ఓట్లు, జనసేనకు 10కి పైగా సీట్లు, 13 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్లు, 7 శాతం ఓట్లు పడతాయని తేలిందని తెలుస్తోంది.
చంద్రబాబుకు ఇలా..
చంద్రబాబు పని తీరుపై సరాసరిగా ఆయా నియోజకవర్గాల్లో 70 శాతం సంతృప్తి, ఎమ్మెల్యేల పని తీరుపై 30 శాతం సంతృప్తి ఉందని తెలుస్తోంది. టిడిపి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కనిపిస్తోందని 43 శాతం మంది, కనిపించడం లేదని 25 శాతం మంది, పరవాలేదని 20 శాతం మంది చెప్పగా, 12 శఖాతం మంది ఏం చెప్పలేదని తెలుస్తోంది.
వీరి మద్దతు..
2014 ఎన్నికల్లో మద్దతు పలికిన కాపులు ఈసారి కూడా టిడిపికే మద్దతు పలకనున్నారని తేలిందని తెలుస్తోంది. బ్రాహ్మన్లు తదితరులు కూడా అధికార పార్టీకే మద్దతు పలకనున్నారని సర్వేలో తేలిందని సమాచారం. బిజెపితో జట్టు కట్టడం వల్ల మైనార్టీ ఓట్లను మాత్రం టిడిపి దక్కించుకోలేకపోతుందని తేలిందని చెబుతున్నారు.
వైసిపి పరిస్థితి ఇదీ..
నలభై శాతం మంది జగన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నట్లుగా సర్వేలో తేలిందని సమాచారం. అలాగే, రోజా, చెవిరెడ్డి భాస్కర రెడ్డి వంటి వారి వల్ల వైసిపి ఇమేజ్ దెబ్బతింటోందని సర్వేలో తేలిందని చెబుతున్నారు. బిజెపికి మద్దతిస్తానని చెప్పడం ద్వారా మైనార్టీలు జగన్ పట్ల కొంత అనుమానంగా ఉన్నారని సర్వేలో తేలిందని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ మాటేమిటి?
వవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ఇంకా పూర్తిగా జనాల్లోకి వెళ్లలేదని, కేవలం యువతలో మాత్రమే ఆ పార్టీ ప్రభావం కనిపిస్తోందని ప్రశాంత్ కిషోర్ సర్వేలో తేలిందని అంటున్నారు. పవన్ ఒంటరిగా పోటీ చేస్తే పెద్దగా ప్రభావం ఉండదని కూడా తేలిందని అంటున్నారు. పవన్ ఒంటరిగా పోటీ చేస్తే టిడిపి ఓట్లను చీల్చుతుందని తేలింది.