గేమ్ స్టార్ట్... అదే జరిగితే జగన్ సర్కార్ దారులన్నీ మూసుకుపోయినట్లే... పాత సీనే రిపీట్ అయ్యే ఛాన్స్?
ఆంధ్రప్రదేశ్లో తొలి విడత పంచాయితీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వ,ఉద్యోగ సంఘాల అభ్యంతరాలు సహేతుకంగా లేవని చెబుతూ ఎన్నికల ప్రక్రియలో ముందడుగు వేసినట్లు చెప్పారు. నిమ్మగడ్డ ఎన్నికల ప్రక్రియను షురూ చేయడంతో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతుందన్న దానిపైనే అందరి దృష్టి నెలకొంది. ఇప్పటికే సుప్రీంలో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్పై ప్రభుత్వానికి ప్రతికూలంగా తీర్పు వస్తే జగన్ సర్కార్ ఏం చేస్తుంది...?
సుప్రీం జోక్యం ఉండకపోవచ్చు...!!
సాధారణంగా ఎన్నికల కమిషన్ ఒకసారి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాక న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం జరగదు. బహుశా ఈ కారణంతోనే నిమ్మగడ్డను సుప్రీం విచారణ జరిగేవరకూ వేచి చూడాలని ప్రభుత్వ సీఎస్ కోరి ఉండవచ్చు. కానీ ఆ ప్రతిపాదనను తోసిరాజని నిమ్మగడ్డ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. ఒకవేళ సుప్రీం కోర్టు కోరితే తమ వాదనను వినిపిస్తామని చెప్తూనే ఆ పరిస్థితి రాకపోవచ్చునన్న ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ పైనే ఆశలు పెట్టుకుంది. కానీ సుప్రీం కోర్టు గనుక దాన్ని తిరస్కరిస్తే జగన్ ప్రభుత్వం ముందున్న దారులన్నీ దాదాపుగా మూసుకుపోయినట్లే.
పాత సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్...
ఒకవేళ సుప్రీం కోర్టులోనూ జగన్ సర్కార్కు చుక్కెదురైతే పాత సీనే మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక అర్హత నిబంధనలను మారుస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ప్రభుత్వం హైకోర్టు తీర్పుతో భంగపడిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డను అర్ధాంతరంగా ఆ పదవి నుంచి సాగనంపి హడావుడిగా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్కు ఆ బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ నియామకం చెల్లదంటూ నిమ్మగడ్డ న్యాయస్థానాన్ని ఆశ్రయించి విజయం సాధించడంతో ప్రభుత్వం యూటర్న్ తీసుకోక తప్పలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కే ఆ బాధ్యతలు అప్పగించింది. తాజా పరిస్థితులను గమనిస్తుంటే.. జగన్ సర్కార్ ఇప్పుడు కూడా రాజీపడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. లేనిపక్షంలో రాజ్యాంగ సంక్షోభం దిశగా పరిస్థితులు దిగజారితే ప్రభుత్వానికి అవి మరింత నష్టం చేస్తాయి కాబట్టి జగన్ సర్కార్ అంత దాకా తెచ్చుకోక పోవచ్చు.
నిమ్మగడ్డ ఏమంటున్నారు...
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసిన తాజా ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం... తొలి విడత ఎన్నికలను ఫిబ్రవరి 5న నిర్వహించనున్నారు. ఉదయం 6.30గం. నుంచి మధ్యాహ్నం 3.30గం. వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 4గం. నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. తొలి విడత ఎన్నికల కోసం ఈ నెల 25 నుంచి నామినేషన్ల స్వీకరణ,28న నామినేషన్ల పరిశీలన,31న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ప్రకటించారు. ఈ ఎన్నికలు స్వేచ్చగా,న్యాయబద్దంగా జరపాలన్నదే తమ ధ్యేయమని... ఇందుకు ఎవరు ఆటంకాలు సృష్టించినా వారిపై చర్యలు తప్పవని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. అంతేకాదు,కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో స్థానిక నాయకత్వం బలంగా ఉంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత చురుగ్గా సాగుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నిర్వహణకు సిద్దమైనట్లు తెలిపారు.