ఏపీ అసెంబ్లీలో ఏం జరుగుతోంది ? ప్రజా సమస్యల పరిష్కారమా ? ప్రతీకారమా ?
అమరావతి/హైదరాబాద్ : ఏపి శాసన సభలో సభ్యులు హద్దులు దాటుతున్నారా..? ప్రొసీడింగ్స్ కి తీలోదకాలిచ్చి వ్యక్తిగత దూషణలకు ప్రాముఖ్యత ఇస్తున్నారా..? వ్యక్తిగత ఎదురు దాడులతో రాజకీయ ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకుంటున్నారా..? అందుకు శాసన సభను వేదిక చేసుకోవాలని సభ్యులు భావిస్తున్నారా..?అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యల గురించి, ప్రజా సంక్షేమంకోసం తీసుకొచ్చే కొత్త చట్టాల గురించి అదికార, విపక్షాల మద్య ఆరోగ్యవంతమైన చర్చను ప్రజలు కోరుకుంటారు. కాని ప్రజల మనోభావాలకు విరుద్దంగా ఏపి అసెంబ్లీ కొనసాగుతున్నట్టు ప్రత్యక్ష ప్రసారాలు నిరూపిస్తున్నాయి. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు చట్టాల గురించి తెలుసుకోవడం, అనుభవం ఉన్న రాజకీయ నేతల నుండి తెలియని విషయాలను తెలుసుకోవడం వంటి కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.
హద్దులు మీరుతున్న ఏపి శాసన సభ..! ప్రతీకార రాజకీయాలకే ప్రాముఖ్యత..!!
శాసన సభ లోపల అంతా ఒకటే అనే బావనతో ఉంటారు. అదే ప్రజా క్షేత్రంలో రాజకీయ విరోధులుగా వ్యవహరిస్తుండడం అత్యంత సాదారణమైన అంశం. కాని చట్టసభల్లో కూడా శాసన సభ్యులు ఒకరిపై ఒకరు నిప్పులు చెరుక్కోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదికార పార్టీ విదానాలపై ప్రతిపక్షం ప్రశ్నలను సంధించడం, నిలదీయడం అత్యంత సాధారణమైన అంశం. వాటి పైన వివరణ ఇవ్వాల్సిన బాద్యత కూడా అదికార పార్టీ పైన ఉంటుంది. కాని ఏపిలో పరిణామాలు ఇందుకు విరుద్దంగా జరిగిపోతున్నట్టు తెలుస్తోంది. ప్రజా సంక్షేమం గురించి సామరస్య వాతావరణంలో జరగాల్సిన చర్చ కూడా అదికార, ప్రతిపక్ష నేతల మద్య మాటల యుద్దానికి తెరలేపుతోంది. ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటూ ఆగ్రహావేశాలకు లోనౌతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఊగిపోతున్నారు.
ప్రజా సమస్యలపై చర్చ లేదు..! వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యం..!!
ఇవన్నీ ప్రజా స్వామ్యంలో ఎంతవరకు సమంజసమని సామాన్య ప్రజానికం తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు. ఇక ప్రస్తుత ఏపి శాసన సభ సమావేశాల్లో కొత్తగా ఎంపికై తొలిసారి చట్ట సభల్లో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు కూడా తెగ రెచ్చిపోతున్నారు. కొత్తగా మంత్రులుగా అవకాశం దక్కించుకున్న యువ నేతలైతే మరీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలో సుధీర్గ కాలం పనిచేసిన అనుభవమున్న నేతైనప్పటికి ఏకవచనంతో సంభోదిస్తూ రాజకీయ విలువలకు తీలోదకాలిస్తున్నారనే చర్చ జరగుతోంది. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదనే ముఖ్యమైన అంశాన్ని కూడా సదరు నాయకులు మర్చిపోతున్నట్టు తెలుస్తోంది. అధికారం వస్తుంది. పోతుంది. ఒకపుడు అందరినీ శాసించిన సోనియా పరిస్థితి నేడు దీనంగా ఉంది. మోడీ అంటే వీసా ఇవ్వని దేశాలు ఇపుడు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ఇదీ రాజకీయాల్లో ఓ భాగమే.
అదికార పార్టీ నేతల విచిత్ర ప్రవర్తన..! వివరణ తక్కువ వివాదం ఎక్కువ..!!
కాలం అన్నికంటే బలమైంది. పరిపాలనలో నీతి అవినీతి తర్వాత... ముఖ్యంగా వయసుకు, హోదాకు కనీస గౌరవం ఇవ్వాలి. ఈరోజు అసెంబ్లీలో జరిగిన సీన్ చూసి ప్రజలందరూ ముక్కున వేలేసుకునే పరిస్థితి చోటుచేసుకుంది. ఇప్పటి వరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తో పాటు చంద్రబాబును ఎంతో మంది విమర్శించారు. కానీ ఎవరూ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో ప్రవర్తించినట్టు ప్రవర్తించలేదు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వ్యక్తిని అసెంబ్లీలో కోటంరెడ్డి బెదిరించారు. 'ఖబడ్డార్, చంద్రబాబునాయుడు ఖబడ్దార్, ఖబడ్దార్ అంటూ పళ్లు నములుతూ ఒక రౌడీలా బెదిరించారు. దీనిని స్పీకర్ గాని, సీఎం గాని ఖండించకపోవడం గమనార్హం.
అవాక్కవుతున్న ప్రజానికం..! ఆరోగ్యవంతమైన చర్చ జగగాలని ఆకాంక్ష..!!
చంద్రబాబు ప్రజల చేతిలో ఘోరమైన ఓటమిని చవిచూశారు. ఘోరమైన తిరస్కారం మాత్రం పొందలేదు. దీనికి సాక్ష్యం తెలుగుదేశానికి వచ్చిన 40 శాతం ఓట్లే. చంద్రబాబు ఎమ్మెల్యే మాత్రమే కాదు, సాధారణ వ్యక్తి కూడా ఎన్ని విమర్శలు అయినా చేయొచ్చు. అందులో తప్పేంలేదు. కానీ ఆ విమర్శ చేసిన విధానం దారుణంగా ఉంది. ఇంతవరకు చంద్రబాబుకు వైఎస్ హయాంలో కూడా ఇంత అవమానం జరగలేదు. ఈ సంఘటనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. 'ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని వైసీపీ దద్దమ్మలు, దాని గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేక ఎలా రెచ్చిపోతున్నారో చూడండి. మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? రాక్షస రాజ్యంలో ఉన్నామా? ' అంటూ ట్వీట్ చేశారు. చట్ట సభల్లో ఇలాంటి ఘర్షణ పూరిత వాతావరణానికి చరమగీతం పాడాలని, సామరస్య వాతావరణంలో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని ప్రజలు కోరుకుంటున్నట్టు తెలుస్తోంది.