గాజువాకలో గబ్బర్ సింగ్ గణాంకాలేంటి..? గట్టెక్కుతారా..? గాబరా పడతారా..?
అమరావతి/హైదరాబాద్ : ఏపీలో ఎన్నికలు ముగిశాయి. గెలుపు ఎవరిదనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ సారి గెలుపు తమదే అని విపక్ష వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. టీడీపీ సైతం మరోసారి ఏపీ ప్రజలు తమకు అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఎంతో కొంత సత్తా చాటి, ఏపీ రాజకీయాల్లో తమ మార్క్ ఏంటో చూపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తోంది. అందుకోసం గాజువాకలో పోటీ చేసిన గబ్బర్ సింగ్ తన ప్రభావం ఏంటో చూపించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఏపిలో జనసేన ప్రభావం..! మార్పు సాద్యమేనా..!!
ఈ నేపథ్యంలో అసలు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గెలుపుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. భీమవరం, గాజువాక నుంచి అసెంబ్లీకి పోటీ చేసారు పవన్ కళ్యాణ్. అయితే గబ్బర్ సింగ్ గాజువాక నుంచి విజయం సాధిస్తారా..? లేదా..? అనే అంశంపై ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తం 3,09,326 ఓటర్లతో జిల్లాలోనే అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న గాజువాకలో టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుందని తొలుత ప్రచారం జరిగింది.
గాజువాకలో గబ్బర్ సింగ్..! గెలుపు సాద్యమేనా..!!
కాగా అనూహ్యంగా వైకాపా అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి బలమైన పోటీనిచ్చారని తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా, 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన నాగిరెడ్డి సానుభూతి అస్త్రంగా ప్రచారం చేశారు. వయసురీత్యా పెద్దవారైన ఆయన ఇప్పుడు తాను గెలవకపోతే మరో ఐదేళ్ల తరువాత తాను పోటీ చేసే పరిస్థితి కూడా ఉండదని ఓటర్లలో సానుభూతి పొందే ప్రయత్నం చేశారు.
ప్రచారంలో ఇబ్బంది పడ్డ కాటమరాయుడు..! సినీ గ్లామర్ ఎంత వరకు పనికొస్తుంది..!!
మరోవైపు వైసీపీ కూడా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి వ్యూహం ప్రకారం ముందుకు సాగినట్టు తెలుస్తోంది. ఇక పవన్కల్యాణ్కు గాజువాకలో ప్రచారం చేసే విషయంలో ఇబ్బందిపడుతూ వచ్చారు. ఈ విషయంలో ఆయనకు అనేక అవాంతరాలు ఎదురయ్యాయి.
సామాజిక వర్గంపై ఆశలు..! గట్టెక్కిస్తారా..?
ఒక బహిరంగసభ రద్దు కావడం, వడదెబ్బ కారణంగా గాజువాకలో విస్తృత ప్రచారం చేసే అవకాశం దొరక్కపోవడం ఇబ్బందిగా మారాయి. గురువారం పోలింగ్ సందర్భంగా నెలకొన్న పరిస్థితులు కూడా పవన్ విజయావకాశాల్ని సంక్లిష్టం చేశాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి గాజువాక నుంచి గబ్బర్ సింగ్ గెలుస్తారా లేదా అనే అంశం పై ఆసర్తికర చర్చ జరుగుతోంది.