'లోకేష్ను పప్పు అంటే తప్పేంటి?, అతిగా స్పందిస్తే మీకే నష్టం'
సోషల్ మీడియాలో రాహుల్ గాంధీని సైతం పప్పు అంటూ కామెంట్ చేశారని ఉండవల్లి గుర్తు చేశారు. అలాంటప్పుడు లోకేష్ ను పప్పు అంటే తప్పేంటి? అని ప్రశ్నించారు.
రాజమండ్రి: ఏపీ ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తడబడ్డ ప్రతీసారి సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఒకరకంగా సోషల్ మీడియాలో ఆయన్ను ఫుట్ బాల్ ఆడుతున్నారు. అయితే తన తప్పులను సరిదిద్దుకోవాల్సింది పోయి.. కక్ష సాధింపు ధోరణితో లోకేష్ చర్యలకు ఆదేశిస్తుండటం ఆయన్ను మరింత విమర్శలపాలు చేస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇదే విషయంపై స్పందించారు. సోషల్ మీడియా పోస్టింగులపై అతిగా స్పందిస్తే.. అది చంద్రబాబు సర్కార్ కే నష్టమని చెప్పారు. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీని సైతం పప్పు అంటూ కామెంట్ చేశారని ఉండవల్లి గుర్తు చేశారు. అలాంటప్పుడు లోకేష్ ను పప్పు అంటే తప్పేంటి? అని ప్రశ్నించారు.
ఇక ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. వైసీపీ అధినేత జగన్ అవినీతిపరుడని ముందస్తు ఎన్నికలకు సిద్దపడితే ఓట్లు పడవని సూచించారు. రాష్ట్ర రెవెన్యూ లోటును పూడ్చేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం, 2018నాటికి పోలవరం ద్వారా నీళ్లివ్వడం వంటి చర్యలు చేపడితేనే టీడీపీకి ఓట్లు పడుతాయని చెప్పుకొచ్చారు.