బిజెపి మళ్లీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?...టిడిపి కీలక మీటింగ్ లో ప్రధాన చర్చనీయాంశం ఇదే!
అమరావతి:కేంద్రంలో బిజెపి మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?...ఆ పార్టీ ని ఎలా చిత్తుచేయాలి?...ఇదీ అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన టిడిపి కీలక మీటింగ్ లో మెయిన్ డిస్కషన్.
బిజెపిని అడ్డుకునేందుకు జాతీయ స్థాయిలో ఏయే పార్టీలు కలిసి వస్తాయి?...ఏయే రాష్ట్రాలకు చెందిన నాయకులు భాజపాను వ్యతిరేకించడంలో ముందువరుసలో క్రియాశీలకంగా ఉన్నారు?...ఎన్డీఏకు పోటీగా యునైటెడ్ ఫ్రంట్ మాదిరి కూటమి ఏర్పాటుకు అవకాశాలెలా ఉన్నాయి?...ఈ అంశాలపై విభిన్న కోణాల్లో చర్చించడంతో పాటు తెలంగాణలో తెదేపాను బలోపేతం చేయడమెలా?...అనే అంశంపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. వివరాల్లోకి వెళితే...
టిడిపి...కీలక మీటింగ్
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టిడిపి భవిష్యత్తు నిర్ణయాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులు కళా వెంకట్రావు, నారాయణ, కాలువ శ్రీనివాసులు, లోకేష్, అచ్చెన్నాయుడు, ఆనందబాబు, ఎంపీలు సీఎం రమేష్, రామ్మోహన్ నాయుడు, గరికపాటి మోహనరావు, కనకమేడల రవీంద్ర కుమార్ తదితరులతో సచివాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. ఈ కీలక సమావేశంలో కేంద్రంలో తిరిగి బిజెపిని అధికారంలోకి రాకుండా ఏం చెయ్యాలనేదే ప్రధాన అంశంగా చర్చ జరిపినట్లు తెలిసింది.
యునైటెడ్ ఫ్రంట్...చంద్రబాబు నాయకత్వం...
కేంద్ర ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాస తీర్మానం తరువాత బిజెపియేతర పార్టీలు క్రియాశీలమయ్యాయని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. దక్షిణాదితోసహా 200 లోక్సభ స్థానాల్లో బిజెపి కనీసం పోటీలో నిలిచే పరిస్థితి లేదని...ఉత్తరాదిలో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో, కిందటి సాధారణ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్నచోట భాజపా దెబ్బతినబోతోందని పార్టీ నేతలు విశ్లేషించారు. బిజెపికి మొత్తంగా 120 స్థానాలకు మించి రాకపోవచ్చని...అలాగని కాంగ్రెస్కు సైతం 100 స్థానాలకు మించి రావని...ఇలాంటి పరిస్థితుల్లో ఇతర పార్టీలు బాగా బలం పుంజుకుంటాయని టిడిపి నేతలు అభిప్రాయపడ్డారు. గతంలో యునైటెడ్ ఫ్రంట్ మాదిరిగా ఈసారి బిజెపి, కాంగ్రెసేతర పక్షాలన్నీ ఏకమవడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, అలాంటి ఫ్రంట్కు మీరు నాయకత్వం వహిస్తే అందరూ సహకరిస్తారని ఎంపీలు చంద్రబాబుకు సూచించారు.
బిజెపి...మళ్లీ రాకుండా చూడాలి...
యునైటెడ్ ఫ్రంట్, దానికి నాయకత్వం గురించి ఇప్పుడు చర్చ అనవసరమని, బిజెపి మళ్లీ అధికారంలోకి రాకుండా చూసేందుకు జాతీయ స్థాయిలో ఏం చేయాలన్నదే మన ముందున్న సవాలని చంద్రబాబు పార్టీ నేతలతో చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగించిన బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శత్రువుగా మారిందని, ఆ పార్టీని తిరిగి కేంద్రంలో అధికారంలోకి రాకుండా ఓడించగలిగితేనే మన రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. కర్నూలులో ధర్మపోరాట సభ తరువాత ఎంపీలతో సమావేశం పెడతానని, భవిష్యత్తు కార్యాచరణపై అందులో నిర్ణయం తీసుకుందామని సీఎం ఈ సందర్భంగా పార్టీ నేతలతో అన్నారు.
తెలంగాణాలో...పరిస్థితిపై చర్చ
తెలంగాణలో తెదేపాతో పొత్తుపై కాంగ్రెస్ నాయకులే మాట్లాడుతున్నారని ఎంపీ గరికపాటి మోహనరావు పేర్కొనగా...మనమెప్పుడూ ఆ విషయం గురించి చెప్పలేదు కదా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్రంపై టిడిపి అవిశ్వాస తీర్మానం సమయంలోనూ కాంగ్రెసే స్వచ్ఛందంగా మనకు మద్దతిచ్చిందని, మనం అడగలేదని గుర్తుచేశారు. తెలంగాణలో కిందటి శాసనసభ ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీ చేయగా టిడిపికి 22శాతం ఓట్లు వచ్చాయని...అక్కడ ఓటు బ్యాంకుకు, క్యాడర్కు కొదవ లేదని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణ నాయకులతో చర్చించి 3 చోట్ల భారీ బహిరంగసభలు నిర్వహిద్దామని, పార్టీ బలోపేతానికి పొత్తులు, ఇతరత్రా తీసుకోవాల్సిన కార్యక్రమాలపై అక్కడి నాయకులతో చర్చించాకే ఒక నిర్ణయానికి రావాలని తుదినిర్ణయానికి వచ్చారు.