అసెంబ్లీలో మీరు చేసింది చట్టబద్ధం అయితే మండలిలో మేం చేసింది అదే : టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు
ఏపీ శాసనసభలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ,సిఆర్డీఏ బిల్లు రద్దుకు ఆమోదం తెలిపి శాసనమండలిలోనూ బిల్స్ పాస్ చేయించాలని ప్రయత్నం చేసిన ఏపీ ప్రభుత్వానికి టీడీపీ షాక్ ఇచ్చింది. మండలిలో టీడీపీ తాము అనుకున్న విధంగా సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపేలా చేసి మూడు రాజధానుల బిల్లుపై నిర్ణయం జాప్యం జరిగేలా చేసింది. ఇక ఈనేపధ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
మండలిలో పరిణామాలపై వైసీపీ ఎటాక్ .. టీడీపీ కౌంటర్ ఎటాక్
ఇక తాజా పరిణామాల నేపధ్యంలో మండలి రద్దుకు వైసీపీ సర్కార్ ప్రయత్నాలు సాగిస్తుంది. ఇక వైసీపీ మంత్రులు మండలి చైర్మన్ షరీఫ్ తీరును తప్పు పడుతున్నారు. తాబేదార్ల వ్యవస్థ చంద్రబాబుకు అనుకూలంగా పని చేసిందని మండిపడుతున్నారు. ఇలాంటి వ్యవస్థ అవసరమా అన్న ఆలోచనలో సర్కార్ ఉందని చెప్తున్నారు. ఇక ఇదే క్రమంలో ప్రతిపక్ష టీడీపీ నేత ఎమ్మెల్సీ అశోక్ బాబు వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీ లో మీరు చేస్తే చట్టబద్దం ... మండలిలో కాదా ?
ఒక రాష్ట్రానికి సంబంధించిన రాజధానిని మూడు ముక్కలు చేసే బిల్లు పది గంటల్లో అమల్లోకి రావాలనే వైసీపీ ఆలోచన తప్పని ఆయన అన్నారు. అసెంబ్లీలో చట్టప్రకారం బిల్లు చేశామని చెప్పుకుంటున్న వైసీపీ నేతలకు అలాంటి చట్టాలే మండలికి వర్తిస్తాయని తెలియదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో ఎలా వైసీపీ చట్టం ప్రకారం ముందుకు వెళ్లిందో, మండలిలో కూడా అలాగే చట్ట బద్దంగా వ్యవహరించారని దీనిపై విమర్శలు చెయ్యటం కరెక్ట్ కాదని అశోక్ బాబు అన్నారు.
రాజధాని వికేంద్రీకరణ బిల్లు పాస్ చెయ్యటం అంత ఈజీనా ?...
ఇదేమైనా బడ్జెట్ కు సంబంధించిన సవరణ బిల్లా ? బలం ఉందన్న అహంకారంతో అసెంబ్లీలో బిల్ పాస్ చేశారని పేర్కొన్నారు . అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులో సవరణలు పేర్కొన్నామని చెప్పిన అశోక్ బాబు కావాలని వైసీపీ మంత్రులు రాద్దాంతం చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో మెజార్టీ సభ్యుల నిర్ణయంతో ఎలాగైతే బిల్లు పాస్ చేసే అవకాశం ఉందో అలాగే మండలిలోనూ తిరస్కరించే అధికారం ఉందని ఆయన చెప్పారు. ఒక రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలు చెయ్యటం అంటే ఉదయం క్యాబినెట్ భేటీ పెట్టి 10 గంటలకు బీఏసీ సమావేశం పెట్టి 11 గంటలకు అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించటమా? అది అంత ఈజీనా అని ఆయన నిప్పులు చెరిగారు .