సూపర్ స్టార్ కృష్ణ-బాలుకు మధ్య గొడవేంటి... కొన్నేళ్లు ఆయన సినిమాల్లో ఎందుకు పాడలేదు...
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కన్నుమూత సినీ ఇండస్ట్రీని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. తన గాత్రంతో కోట్లాది మందిని ఓలలాడించిన ఎస్పీబీ ఇక లేరన్న విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దాదాపు 50 రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం(సెప్టెంబర్ 24) కన్నుమూశారు. బాలు మరణంతో ఆయన పాటల ప్రవాహాన్ని,ఆయన జీవిత విశేషాలను అభిమానులు,సినీ లోకం మరోసారి గుర్తుచేసుకుంటోంది. వివాదరహితుడైన బాలుకు ఇండస్ట్రీలో అందరితోనూ సత్సంబంధాలున్నాయి. కానీ ఒకానొక సందర్భంలో సూపర్ కృష్ణకు,ఆయనకు మధ్య ఓ వివాదం తలెత్తింది..
Recommended Video
ఎస్పీ బాలుకి ప్రముఖుల నివాళి .. ఉపరాష్ట్రపతి వెంకయ్యతో పాటు తెలుగురాష్ట్రాల సీఎంలు
ఏంటా వివాదం....
సూపర్ స్టార్ కృష్ణతో వివాదం గురించి ఓ ఇంటర్వ్యూలో బాల సుబ్రహ్మణ్యమే స్వయంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అప్పట్లో తామిద్దరం ఓసారి టెలిఫోన్లో మాట్లాడుకుంటుండగా ఇద్దరి మధ్య వివాదం తలెత్తిందన్నారు. ఎన్నడూ కఠినంగా మాట్లాడని ఆయన... ఎన్నడూ కఠినంగా ఉండని తాను... ఆరోజు పరస్పరం కాస్త నొప్పించుకునే రీతిలో మాట్లాడుకున్నట్లు చెప్పారు. అప్పటినుంచి ఆయనకు పాటలు పాడటం మానేసినట్లు తెలిపారు. అయినప్పటికీ తాను ఎక్కడ కలిసినా కృష్ణ గారు మామూలుగానే మాట్లాడేవారని... తాను కూడా ఆయన పట్ల అంతే గౌరవంతో ఉండేవాడినని చెప్పారు.
సయోధ్య కుదర్చాలని చూసినా...
ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు విఫలయత్నం చేసి ఇండస్ట్రీ నలిగిపోయిందన్నారు బాలు. ఓరోజు రాజ్కోటి మ్యూజిక్ చేస్తున్న సినిమాకు పాడేందుకు వెళ్లానని చెప్పిన బాలు... అక్కడ గేయ రచయిత వేటూరి సుందర్రామూర్తి ఈ వివాదం గురించి ప్రస్తావించినట్లు చెప్పారు. కృష్ణకు నువ్వు పాట పాడనంటే ఎట్లాగయ్యా అని సుందర్రామూర్తి అడిగారని... అయితే అప్పటికే ఆయన విశ్వనాథ్ సినిమాకు పాట రాయనని భీష్మించుకు కూర్చొన్నారని... దాంతో తాను ఆ విషయం ప్రస్తావించానని చెప్పారు. నన్నడుగుతున్నారు సరే... మరి మీరేందుకు అన్నయ్య(విశ్వనాథ్) సినిమాకు పాట రాయరని వేటూరిని ప్రశ్నించినట్లు చెప్పారు. దానికి ఆయన సమాధానం దాటవేశారన్నారు.
వేటూరి మధ్యవర్తిత్వం...
ఆ తర్వాత ఒకానొక రోజు మళ్లీ వేటూరి సుందర్రామూర్తే తనకు ఫోన్ చేశారని చెప్పిన బాలు... 'ఆయనతో మాట్లాడానయ్యా... నీతోనూ మాట్లాడుతున్నాను... అదేముంది బాలు,నేనూ ఎక్కడైనా కలుసుకుంటామని ఆయన చెప్పారు...' అని చెప్పినట్లు తెలిపారు. దీంతో ఆయన నన్ను కలుసుకోవడం కాదు... నేనే వెళ్లి ఆయన్ను కలుసుకుంటానని చెప్పానన్నారు. ఆ వెంటనే పద్మాలయ స్టూడియోకి వెళ్లగా... అక్కడి స్టాఫ్ అంతా ఆశ్చర్యపోయారని చెప్పారు. అప్పటికి దాదాపు రెండేళ్ల నుంచి తాను అక్కడికి వెళ్లడం లేదని... అకస్మాత్తుగా వెళ్లేసరికి వాళ్లంతా షాక్ తిన్నారని చెప్పారు. కృష్ణ గారు ఎక్కడని అడిగితే పై అంతస్తులో ఉన్నారని చెప్పడంతో... అక్కడికి వెళ్లినట్లు చెప్పారు.
ఇలా సమసిపోయింది...
కృష్ణ గారి దగ్గరకు వెళ్లాక... సార్ ఆరోజు నేను ఫోన్లో ఏం చెప్పదలుచుకున్నానో... ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను... దయచేసి నన్ను వివరించనివ్వండని ఆయనతో చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే కృష్ణ మాత్రం... 'ఏమండీ అవేవీ వద్దండి... ఈరోజు నుంచి ఇద్దరం కలిసి మంచిగా పని చేసుకుందాం..' అని చెప్పారన్నారు. ఆ ఒక్క మాటతో అంతా సెటిల్ అయిపోయిందన్నారు. ఆయనేమీ అడగలేదని... ఇక తాను కూడా ఏమీ చెప్పలేదన్నారు. అలా ఆ వివాదం సమసిపోయిందని చెప్పుకొచ్చారు.