నా వద్దకు వారిని పంపించడమా?: ఇక, చంద్రబాబుతో బండారు తాడోపేడో
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంత్రివర్గ విస్తరణ సెగ తగులుతోంది. ఇప్పటికే బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తనను మంత్రివర్గం నుంచి తొలగించినందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొందరు చల్లబడినప్పటికీ..
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంత్రివర్గ విస్తరణ సెగ తగులుతోంది. ఇప్పటికే బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తనను మంత్రివర్గం నుంచి తొలగించినందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొందరు చల్లబడినప్పటికీ.. మరికొందరు మాత్రం అసంతృప్తితో ఉన్నారు..
రోజంతా సస్పెన్స్: ఇంటికి బండారు, కూతురు పెళ్లి తర్వాత బాబుతో తాడోపేడో
విసాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కూడా తన అలకను వీడలేదు. మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆయన ఒక రోజుకు పైగా కనిపించకుండా పోయారు. నాటి నుంచి అసంతృప్తి వీడనట్లుగానే కనిపిస్తోంది.
బండారు అసంతృప్తిపై ఆందోళన
బండారు అసంతృప్తి ఎటు తిరిగి ఎటు వెళ్తుందోనని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. ఆవిర్భావం నుంచి టిడిపిలో కొనసాగుతూ, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఓసారి మంత్రిగా పని చేశారు. ఈసారి కూడా తనను కేబినెట్లోకి తీసుకుంటారని భావించారు.
అనిత వంటి వారు చల్లబడ్డా..
జిల్లాకే చెందిన వంగలపూడి అనిత, కిడారి సర్వేశ్వర రావు తదితరులు అసంతృప్తి వ్యక్తం చేసినా ఒకటి రెండు రోజులకు సర్దుకున్నారు. కానీ బండారు మాత్రం ఇంకా అసహనంతోనే ఉన్నారు.
తొలుత ఆయన అనుచరులు ధర్నా చేయడం, ఆ తర్వాత గన్మెన్లను వెనక్కి పంపించడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత బండారు చల్లబడతారని అందరూ భావించారు. కానీ ఆయన మాత్రం తగ్గలేదు. మంత్రులు, ఇతర నేతలు ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది.
కుమార్తె పెళ్లి తర్వాత తాడేపేడో
శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడుతో బండారు కుమార్తె వివాహం ఈ జూన్ నెలలో జరగనుంది. ఈ నేపథ్యంలో జూన్ తర్వాత తన నిర్ణయాన్ని ఆయన ప్రకటిస్తారని భావిస్తున్నారు. అప్పుడు చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకుంటారని అంటున్నారు. అయ్యన్నకు పదవి ఇవ్వడం వల్లే బండారుకు ఇవ్వలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మహానాడుకు రాకుంటే..
టిడిపి అట్టహాసంగా నిర్వహించే మహానాడును ఈ ఏడాది విశాఖలో నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. మే 27, 28, 29 తేదీల్లో నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి.
ఏకంగా సీఎం కార్యక్రమానికే డుమ్మా కొట్టిన బండారు.. మహానాడుకు వస్తారా అనే చర్చ సాగుతోంది. జిల్లాలో జరిగి మహానాడుకు బండారు గైర్హాజరైతే చంద్రబాబుకు పెద్ద షాకే అంటున్నారు. ఆయన అలక తగ్గించేందుకు మరేదైనా పదవి ఇస్తారా అనే చర్చ సాగుతోంది.
చంద్రబాబు తీరుపై గుర్రు
పార్టీలు మారకుండా నిబద్దతతో పని చేస్తున్న తన పట్ల అధిష్టానం వ్యవహరించిన తీరుపై బండారు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ సమయంలో సీనియర్గా తన పేరును కూడా పరిశీలించవలసి ఉండెనని చెబుతున్నారు. ఆ తర్వాత అయినా ఎందుకు ఇవ్వలేకపోయామో చెప్పినా బాగుండేదని అంటున్నారు.
గంటా లాంటి వారిని పంపించడం ఏమిటి?
పార్టీలు మారిన గంటా శ్రీనివాస్ వంటి వారిని తన వద్దకు రాయబారం పంపించడం ఏమిటని బండారు సత్యనారాయణ మూర్తి గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఇదే ఆయన అనుచరుల్లోను ఆగ్రహం తెప్పిస్తోందని చెబుతున్నారు. మూడు వారాలుగా బండారు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.