బీజేపీ-కాంగ్రెస్ సరే.. జనసేన మాటేమిటి?: జగన్ ఆశలను పవన్ కళ్యాణ్ దెబ్బకొడతారా?
అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు సంస్థలు ప్రీపోల్ సర్వేలు, ఒపీనియన్ పోల్ సర్వేలు నిర్వహిస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేలు కూడా వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు సీట్ల సంఖ్య తగ్గుతుందని, మెజార్టీకి దరిదాపుల్లో ఆగిపోతుందని, ఇతర పార్టీల మద్దతుతో మళ్లీ నరేంద్ర మోడీయే ప్రధాని అవుతారని చెబుతున్నాయి.
'మైనస్ జనసేన' సర్వే.. ఎందుకంటే! జగన్-బాబులకు అసలు కథ ముందుందా?
జనసేన ప్రస్తావన లేదు
ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఆయా సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. తెలంగాణలో విషయాన్ని పక్కన పెడితే.. ఏపీలోని సర్వే అంశం చర్చనీయాంశంగా మారుతోంది. ఏపీలో టీడీపీకి ఇన్ని సీట్లు, వైసీపీకి ఇన్ని సీట్లు వస్తాయని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గెలవవని.. చెబుతూ వాటి ఓటు శాతం కూడా చెబుతున్నాయి. కానీ వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారుతారని రెండు తెలుగు రాష్ట్రాలు భావిస్తున్న పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ప్రస్తావన లేదు.
బీజేపీ, కాంగ్రెస్ల ఓట్ల శాతం కూడా చెబుతున్నారు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పార్టీ పైన ప్రధానంగా దృష్టి సారించారు. ఆయన అధికార, విపక్షాలను తూలనాడుతూ... జనసేన వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పి నెలలు గడుస్తోంది. అయినప్పటికీ జాతీయ మీడియా సర్వేల్లో జనసేన ప్రస్తావన లేకపోవడం ఏమిటనే అనుమానాలు లేవనెత్తుతున్నారు. ఒక్క సీటు గెలవదని చెబుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వచ్చే ఓట్లు కూడా ఇస్తున్నారని, కానీ జనసేన ప్రస్తావన లేదని అంటున్నారు. జనసేన ఇప్పటి వరకు ప్రజల్లో లేనందున జాతీయ సర్వేలు ఆ పార్టీని పరిగణలోకి తీసుకోలేకపోవచ్చునని చెబుతున్నారు. పైగా పవన్ ఇటీవలే పార్టీపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో సర్వేలో దానిని పరిగణలోకి తీసుకోకపోవచ్చునని చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ దెబ్బ ఎవరికి?
జాతీయ ప్రీపోల్ సర్వేల విషయం ఎలా ఉన్నా వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇప్పటికే ఏపీలో ముక్కోణపు పోటీ నెలకొని ఉంటుందని చెబుతున్నారు. దీనిని బట్టే జనసేన ప్రభావం అంచనా వేయవచ్చునని అంటున్నారు. జనసేన ప్రభావంతో నష్టం టీడీపీకి జరుగుతుందా, వైసీపీకి జరుగుతుందా అనే చర్చ కూడా సాగుతోంది. గత ఎన్నికల్లో పవన్ టీడీపీకి మద్దతిచ్చారని, దానిని బట్టి అధికార పార్టీకే దెబ్బ అని కొందరు అంటుంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని, అది వైసీపీకి మైనస్ అని మరికొందరు అంటున్నారు.
పవన్ కళ్యాణ్ దెబ్బ చంద్రబాబుకా, జగన్కా?
వచ్చే లోకసభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి 13 సీట్లు మొదలు 23 వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. బుధవారం విడుదలైన టైమ్స్ నౌ సర్వేలో వైసీపీకి 23 లోకసభ స్థానాలు, టీడీపీకి 2 వస్తాయని తేలింది. నిన్నటి సర్వే ఫలితాలపై వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని, మనం కీలకంగా మారనున్నామని, ప్రత్యేక హోదా ఇచ్చిన వారికి మద్దతిస్తామని చెప్పారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు గెలవడం ద్వారా కేంద్రంలో మనం చక్రం తిప్పవచ్చునని టీడీపీ నేతలు గత కొద్దికాలంగా చెబుతున్నారు. అయితే ప్రీపోల్ సర్వే ఫలితాలు జనసేనను పరిగణలోకి తీసుకోకుండా చేసినవి కాబట్టి పవన్ కళ్యాణ్ దెబ్బతీసేది జగన్నా? లేక చంద్రబాబునా? అనే చర్చ సాగుతోంది. ఎవరిని దెబ్బతీసినా ఢిల్లీలో చక్రం తిప్పాలన్న వారి ఆశలకు గండి కొట్టినట్లే అంటున్నారు.