భూసేకరణపై జనసేనాని స్టాండ్ ఏంటి..? : ప్రభుత్వంతో విబేధిస్తారా..? అసలు ప్రశ్నిస్తారా..?
విజయవాడ : రాజకీయాలంటేనే అనిశ్చితికి మారుపేరు. అందునా.. ప్రజల పక్షాన నిలబడాలనుకున్నప్పుడు మెతక వైఖరితో వ్యవహరించడం అసలుకే ఎసరు తెచ్చే అంశం. అధికార పక్షంతో ఎంతటి మితృత్వం ఉన్నా.. ప్రజా సమస్యలపై స్పందించాల్సిన సమయంలోను నోరు మెదపుకుండా కాలం వెళ్లదీస్తే.. రాజకీయ మనుగడ కష్టమే.
తాజాగా ఏపీ సర్కార్ భూసేకరణ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుండడంతో.. విషయంలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుంటారా..! లేదా..! అన్న చర్చ జోరందుకుంది. గతంలో ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటుంటే రాజధాని ప్రాంతాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్ బలవంతంగా భూములు లాక్కోవద్దంటూ ప్రభుత్వానికి హితవు పలికారు.
దీంతో విషయంపై ప్రభుత్వం కాస్త వెనకడుగు వేసినట్టే కనిపించినా..! తాజాగా మళ్లీ భూసేకరణ ప్రయత్నాలు మొదలవతుండడంతో.. జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ నాటికి 2,500 ఎకరాలను సేకరించి తీరుతామని ప్రభుత్వం ఖరాఖండిగా చెబుతుండడంతో ప్రస్తుతం అక్కడి రైతుల్లో ఆందోళన నెలకొంది.
కాగా, గతంలో రాజధాని ప్రాంతంలో పర్యటించిన పవన్ కళ్యాణ్.. అక్కడి రైతుల అభ్యంతరాలపై స్పందిస్తూనే సీఎం చంద్రబాబు న్యాయం చేస్తారనే నమ్మకం తనకుందంటూ ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరించారు. మరి తాజాగా ప్రభుత్వం మళ్లీ ఆ దిశగా అడుగులు వేస్తుండడంతో భూసేకరణ విషయంలో ప్రభుత్వంతో విబేధించడానికి సిద్దపడుతారా.. లేక గతంలో లాగే ప్రభుత్వానికి అనుకూలంగా తన పాత పంథానే కొనసాగిస్తారా అన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం.