కోడెల హైడ్రామాకు కారణం ఎంటి..!? రాజుపాలెంలో అసంత్రుప్తి ఎందుకు రాజుకుంది..?
అమరావతి/హైదరాబాద్ : ఏపీలో ఎన్నికలరోజు సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ పై దాడి జరిగింది. కారు అద్దాలు పగులగొట్టి, కోడెల చొక్కా చించేశారు. అటువంటి పరిస్థితుల్లో ముఖం దీనంగా పెట్టి, చిరిగిన చొక్కాతోనే తన ఓటు హక్కును వినియోగించున్నారు కోడెల. చాలా ఆసక్తికరంగా, మరింత నాటకీయంగా చోటుచేసుకున్న పరిణామాలకు రాజుపాలెం మండలంలోని ఇనుమంట్ల గ్రామం వేదికగా మారింది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది అనేది ఇప్పటికీ చర్చనీయాంశంగానే మారింది.
సత్తెనపల్లిలో హై ఓల్టేజ్..! కోడెల ఎందుకు టార్గెట్ అయ్యారు..!!
వాస్తవానికి ఎన్నికలు చాలా సున్నితమైన అంశం. పైగా గుంటూరు వంటిచోట మరింత కీలకం. పల్నాడులో పాతపగలు.. ఫ్యాక్షన్ తగాదాలు.. అన్నింటినీ తలదన్నేలా కులాల మధ్య ఆధిపత్యం మరింత చికాకు పెడుతుంది. 2014 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి సత్తెనపల్లి వచ్చిన కోడెల 800 పై చిలుకు ఓట్ల తేడాతో బయటపడ్డారు. వైసీపీ అభ్యర్థి అంబటిరాంబాబు అతి ఆత్మవిశ్వాసం పరాజయం పాల్జేసింది. మళ్లీ 2019లో అదే ప్రత్యర్థులు సిద్ధమయ్యారు. కానీ.. పరిస్థితులు చాలా మారాయి. పేరున్న వైద్యుడిగా.. టీడీపీ సీనియర్ నేత గానే కాకుండా కోడెలకు చెడ్డపేరు కూడా లేకపోలేదు.
అదుపులో లేని కొడుకు, కూతురు..! అంత బరితెంగుంపు అవసరమా..!!
నర్సరావుపేటలోని ఆయన ఇంట్లో 1998లో జరిగిన బాంబుపేలుళ్లు ఆయన్ను వెంటాడుతూనే ఉంది. ఫ్లై ఓవర్ నిర్మాణంతో వైశ్యులకు ఇబ్బంది తెచ్చిపెట్టారనే విమర్శలున్నాయి. ఇపుడు వారసుల రూపంలో అవినీతి ముద్ర కూడా తప్పలేదు. సత్తెనపల్లిలో డెవలప్ మెంట్ తోపాటు అవినీతి కూడా తారాస్థాయికి చేరింది. దానికి కోడెల కొడుకు, కూతురు కారణమనేంతగా చేరింది. కోడెలను సత్తెనపల్లిలోకి రావద్దంటూ టీడీపీ నేతలే ప్రదర్శనలు చేపట్టారు. అటువంటి వ్యతిరేకత మధ్య కోడెల తన సీనియార్టీతో టికెట్ సంపాదించారు. తాను మారానంటూ.. కొడుకు, కూతురులను పట్టించుకోవద్దని.. ఈ సారికి తనను మాత్రమే చూడాలంటూ ప్రచారం చేశారు.
వివాదాలు వెంటాడుతున్నా పట్టించుకోని కోడెల..! ప్రజల నాడిని పట్టుకోలేకపోయిన స్పీకర్..!!
జనసేన తరపున యర్రంరెడ్డి రంగంలోకి దిగటంతో ఒక్క సారిగా సమీకరణలు మారాయి. సత్తెనపల్లిలో గెలుపులో కీలమైన రెడ్డి, కాపుల ఓట్లు చీలిక వైసీపీ, టీడీపీలను కాస్త గందరగోళానికి గురిచేశాయి. అంబటి తన పరిచయాలతో కాపులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో సఫలమయ్యారు. దీంతో కోడెల గెలుపు మళ్లీ ఊగిసలాటలో పడిపోయింది. పైగా వైసీపీ అనుకూలమైన గ్రామాల్లో ఒకటైన ఇనుమంట్లలో ఏకపక్షంగా పోలింగ్ జరుగుతుందనే సమాచారంతో కోడెల అక్కడకు చేరారట. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి తలుపులు మూసివేశారట. దీంతో స్థానిక గ్రామస్థులు ఒక్కసారిగా తలుపులు బద్దలు కొట్టి బయటకు తీసుకువచ్చారు.
కోడెల ఎపిసోడ్ ను సీరియస్ గా తీసుకున్న టీడిపి..! చెక్ పెట్టే అవకాశం..!!
ఈ తోపులాటలో చొక్కా చిరిగిందంటూ వైసీపీ వాదన. దీన్ని సానుభూతిగా మలచుకునేందుకు కోడెల పెద్ద డ్రామానే నడిపించారని.. తమ వాళ్లను కొట్టి.. చివరకు తాను అమాయకత్వం నటించారంటున్నారు. ఎన్నికల తరువాత విషయాన్ని టీడిపి సీరియస్ గా తీసుకుంది. ఎలాగూ తామే అధికారంలో ఉన్నాం కాబట్టి.. గ్రామంలో అరెస్టులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకూ 10 మంది పురుషులను అరెస్టు చేశారట. మరో 90 మంది కోసం వేట కొనసాగిస్తున్నారట. వీరిలో మహిళలు కూడా ఉండటంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.