coronavirus: షుగర్, పిండి ఉచితంగా ఇవ్వలేరా..? రేషన్ పంపిణీపై దేవినేని ఉమా ఫైర్
ఏపీ ప్రభుత్వంపై విపక్ష టీడీపీ మండిపడింది. కరోనా వైరస్ ప్రబలిన సమయంలో కూడా సరుకులను ఉచితంగా ఇవ్వకపోవడం సరికాదని ఆగ్రహాం వ్యక్తం చేసింది. బియ్యం, కందిపప్పు ఉచితంగా అందజేస్తే సరిపోతుందా అని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గోధుమపిండి, చక్కెర ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.
మంగళవారం దేవినేని ఉమా ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, కొండపల్లిలో పర్యటించారు. సర్వర్లు పనిచేయక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గుర్తుచేశారు. అర్హులకు సరుకులు ఇవ్వడంలో వాలంటీర్లు, వీఆర్వోలు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. బియ్యం, కంది పప్పు ఉచితంగా ఇస్తున్నారని.. చక్కెర, గోధుమపిండి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కిలో షుగర్, పిండికి రూ.30 తీసుకోవడం.. ఈ సమయంలో సరికాదన్నారు. వైరస్ ప్రభావం ఉన్న ఈ టైంలో ప్రభుత్వం మానవత్వంతో పనిచేయడం లేదని మండిపడ్డారు.
వైరస్పై సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్షలు ఆపి.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సూచించారు. నిత్యావసర వస్తువుల కోసం మహిళలు బయటకొస్తున్నారని.. కానీ హై లెవల్ కమిటీ, మంత్రులు మాత్రం ఏసీ గదుల్లో సమీక్షల పేరుతో కాలం గడుపుతున్నారని ఆరోపించారు. రెవెన్యూ వ్యవస్థను సీఎం జగన్ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. 90 శాతం పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారని గుర్తుచేశారు. వారితో ఇంటింటికీ రేషన్ పంపిణీ చేయించాలని దేవినేని ఉమా సూచించారు.