చంద్రబాబు అసెంబ్లీలో లెంపలేసుకుని తప్పు అంగీకరిస్తే అప్పుడు జగన్ మాట్లాడతారన్న రోజా
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. గురువారం రెండో రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చంద్రబాబు నాయుడు తన అబద్ధపు హామీలతో మోసం చేశారని రోజా ఆరోపించారు.
అసెంబ్లీలో రైతులకు లెంపలేసుకుని తప్పైందని చెప్తే జగన్ మాట్లాడతారన్న రోజా
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో రైతులకు క్షమాపణ చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రజలకు తాను చేసిన మోసాలను తానే ధైర్యంగా ఒప్పుకుంటే బావుంటుందని ఆమె పేర్కొన్నారు. ఒకపక్కన టీడీపీ నేతలు రైతులకు మిగిలిపోయిన రుణమాఫీని ఎప్పుడు అందిస్తారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ విషయంపై స్పందించిన రోజా చంద్రబాబు అసెంబ్లీలో లెంపలేసుకుని రైతులకు క్షమాపణ చెప్పాలని ఇక ఆ సమయం ఆసన్నమైందని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు . అంతేకాదు చంద్రబాబు నాయుడు తన తప్పును తను అంగీకరిస్తే రుణమాఫీ అంశంపై సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందిస్తారు అంటూ ఆమె పేర్కొన్నారు.
బాబుగారూ మీరు సీఎం కాదు .. ప్రతిపక్ష నాయకుడికి ఉండే సెక్యూరిటీనే ఉంటుంది అన్న రోజా
చంద్రబాబు నాయుడు కావాలని అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని రోజా చంద్రబాబు సెక్యూరిటీ తగ్గించడం పైన తనదైన శైలిలో సమాధానం చెప్పారు. బాబు గారు మీరు ఇప్పుడు సీఎం కాదు అంటూ రోజా చురకలంటించారు. చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్ష నేత అని ఇంకా ఆయన సీఎం అనుకుంటే ఎలా అంటూ రోజా ప్రశ్నించారు . ప్రతి పక్ష నేతకు ఉండే సెక్యూరిటీ నే చంద్రబాబుకు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
Recommended Video
తనను సస్పెండ్ చేసిన విషయంలో ప్రతీకారం ఏం లేదు.. తనకు ఇచ్చే పదవి గురించి తెలీదన్న రోజా
ఇక తనను సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే . ఇక నాటి సస్పెన్షన్ గురించి స్పందించిన రోజా ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండబోవని చెప్పారు.
ఇక రుణమాఫీ అంశం గత ప్రభుత్వపు తప్పుడు హామీ అని, చంద్రబాబు లెంపలేసుకుని తప్పయిందని ఒప్పుకుంటే జగన్ రుణమాఫీ పై మాట్లాడతారని రోజా చెప్పుకొచ్చారు. ఇక తనకు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పదవి గురించి తనకు ఇంకా ఏమీ తెలీదని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి తన ప్రభుత్వంలో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత లో భాగంగా రోజాకు తగిన ప్రాధాన్యత కలిగిన పోస్టు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని రోజాకు ఏపీలో పారిశ్రామిక అభివృద్ది కోసం తీసుకొనే నిర్ణయాల్లో కీలక భూమిక పోషించే ఆంధ్రప్రదేశ్ మౌళిక వసతుల అభివృద్ది సంస్థ (ఏపీఐఐసీ) ఛైర్ పర్సన్గా రోజాను నియమించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇక ఈ పదవి విషయంలో ఆమె తనకేమీ తెలీదని చెప్పి జగన్ అప్పగించే బాధ్యత ఏదైనా నిర్వర్తించటానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ఆసక్తికర వ్యాఖ్యలతో, అనూహ్యమైన పరిణామాలతో ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.