నేను కిందపడితే రాహుల్ వచ్చి లేపారు: జేసీ ఆసక్తికరం, ‘ఆ చోక్రాగాడు అంటే తప్పుకుంటానా?’
Recommended Video
న్యూఢిల్లీ/అమరావతి: తాను తన ప్రజలకు మంచి చేయాలనే రాజకీయాల్లో ఉన్నానని, అది సాధ్యం కాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధమని అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
టీడీపీ ఎమ్మెల్యేతో విభేదాలపై స్పందిస్తూ పది మందికి ఉపయోగపడే పనిచేస్తే ఇబ్బందులేనని అన్నారు. మున్సిపాలిటీకి రావాల్సిన పది రూపాయలు తీసుకుంటున్నారన్నా ఇబ్బందేనని అన్నారు.
ఆ వ్యక్తితో నన్ను పోల్చవద్దు
పొత్తులో భాగంగా బీజేపీకి వచ్చిన ఎమ్మెల్యే సీటును ప్రభాకర్ చౌదరికి కేటాయించేలా తాను, చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు చేశామని చెప్పారు. ప్రభాకర్ చౌదరితో తనను పోల్చవద్దని జేసీ కోరారు. ఆయన వల్ల తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతానని అనడం సరికాదని అన్నారు.
ఆ చోక్రాగాడు అంటే తప్పుకుంటానా?
ఆ చోక్రాగాడు అంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానా? అని జేసీ దివాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తనకు ఎన్నికల్లో గెలుపుల రికార్డు ఉందని చెప్పారు. రూ.40కోట్ల జీవో కోసం 40ఏళ్ల రాజకీయ జీవితాన్ని వదులుకుంటానా? అని ప్రశ్నించారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే ఉంటానని చెప్పారు. ఏనుగులు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయని తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై స్పందించారు జేసీ.
బెదిరింపులు కావు..
అదను చూసి రాజీనామా చేస్తానంటూ ప్రకటనలు చేయడం లేదని.. తన స్వలాభం కోసం తాను బెదిరింపులకు గురిచేయడం లేదని.. తాను ఏదైనా ప్రజల కోసమే చేస్తానని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన కోసమే బెదిరింపులకు గురిచేస్తే అది తప్పు అవుతుందని అన్నారు. తాను చేసేదే బ్లాక్ మెయిల్ అంటే తనకు ఇబ్బందేమీ లేదని అన్నారు.
వయసు పైబడింది.. పరిస్థితులు కూడా...
తాను రాజకీయాల నుంచి రిటైర్డ్ కాబోతున్నట్లు కొత్తగా చెప్పడం లేదని అన్నారు. తానే కాదు, ఆత్మ విమర్శ చేసుకుంటే ఎంపీలందరూ విఫలమైనట్లేనని జేసీ వ్యాఖ్యానించారు. తనకు వయస్సు పైబడిందని, 1972 నుంచి తాను ఏదో ఒక పదవిలో కొనసాగుతున్నానని జేసీ చెప్పారు. ఇంకా ఎంతకాలం చేయాలని అన్నారు.మారిన రాజకీయ పరిస్థితులు కూడా తాను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కారణమని చెప్పారు.
కిందపడితే రాహుల్ వచ్చి లేపారు..
కాగా, శుక్రవారం పార్లమెంటు సమావేశాలకు హాజరైన సందర్భంలో మీడియా ప్రతినిధులు తోయడంతో తాను కిందపడిపోయానని, తనకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ఆ సమయంలో అటుగా వస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కిందపడిన తనను పైకి లేపారని చెప్పారు. మానవత్వంతోనే రాహుల్ అలా చేశారని చెప్పారు.
తండ్రి పేరు చెప్పుకోవడం కాదు.. పవన్ రెడ్డిపై ఇలా
వైసీపీలోకి తన కొడుకు వెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారంలో వాస్తవం లేదని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. వారసులు రాజకీయాల్లోకి రావడం అనేది కొత్తేం కాదని అన్నారు. అర్హత ఉంటే పార్టీ టికెట్ ఇస్తుందని, ప్రజలు గెలిపిస్తారని జేసీ చెప్పారు. వైయస్ జగన్లా తండ్రి పేరు చెప్పుకోవడం కాదు.. తానేంటో చెప్పుకోవాలని.. జేసీ కొడుకు అంటే సరిపోదని అన్నారు. జేసీ పవన్ రెడ్డి సహజంగానే టీడీపీ నాయకుడు అవుతారని జేసీ చెప్పారు. తాను ఉన్నంత కాలం ప్రజల్లోనే ఉంటా.. ప్రజల కోసమే చస్తా అని జేసీ వ్యాఖ్యానించారు.