పవన్ కళ్యాణ్! రిషికేశ్వరి మాటేమిటి: ఏకేసిన రోజా, పంచెలు తడుస్తున్నాయి
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా బుధవారం నాడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన నిప్పులు చెరిగారు. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట వైసిపి అధ్యక్షులు జగన్ ధర్నా చేపట్టారు. రాజధాని కోసం రైతుల నుంచి భూములు సేకరిండాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తున్నారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడారు. ప్రజల సమస్యల పైన కాంగ్రెస్, పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నారని, జగన్ స్పందించడం లేదని ఓ పత్రికలో వార్త వచ్చిందని, అది సరికాదని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చి, ఏపీని రోడ్డున పడేస్తే, ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకు రాకుంటే ఎల్లో మీడియా మాట్లాడదన్నారు.
జర్నలిజాన్ని ప్రజలు గౌరవించేలా ఎల్లో మీడియా నడుచుకోవాలన్నారు. ప్రజల సమస్యల పైన కాంగ్రెస్, పవన్ కళ్యాణ్ దూసుకెళ్తున్నారని, జగన్ వెనుకబడ్డారని ఓ పత్రిక రాసిందన్నారు.
ప్రజల సమస్యల విషయంలో జగన్ స్పందిస్తున్నారని ఆ పత్రిక తెలుసుకోవాలన్నారు. కాగా, ఆ వార్త ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి రాసింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ వచ్చాడని పత్రిక చెబుతోందని, కానీ ఇదే పవన్ కళ్యాణ్ రైతు రుణమాఫీ అంశం, వనజాక్షిపై దాడి జరిగినప్పుడు, రిషికేశ్వరి ఘటన పైన స్పందించలేదన్నాడు.
ప్రత్యేక హోదా రాకుంటే ఏపీ సర్వనాశనం అవుతుందని తెలిసినా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడటం లేదన్నాడు. రాజధాని భూసేకరణ పైన మాత్రమే పవన్ మాట్లాడుతున్నారన్నారు.
మిగిలిన రెండు మూడు వేల ఎకరాలు కూడా బలంతంగా లాక్కోండని లోపల చెప్పారని, కానీ తాను ప్రశ్నించలేనని చెడ్డపేరు వస్తుందనే బయటకు వచ్చారన్నారు. చంద్రబాబు లాంటి సీఎం ఉండటం తమ దౌర్భాగ్యమని, జగన్ సిఎంగా ఉంటే బాగుండేదని ప్రజలు చెబుతున్నారన్నారు.
హోదాకు, ప్యాకేజీకి తేడా తెలియని చంద్రబాబు సీఎం కావడం దౌర్భాగ్యమన్నారు. మంత్రి నారాయణను ఉద్దేశించి మాట్లాడుతూ.. రూ.5వేలు తక్కువైతే మీ నారాయణ విద్యా సంస్థల బస్సులు ఎక్కనివ్వరని, అలాంటిది ఒకటి, రెండు ఎకరాలు ఉన్న రైతులు తమకు అన్నం పెట్టే భూమిని ఎలా ఇస్తారన్నారు.
రాజధానికి భూములు ఇచ్చే రైతుల పిల్లలకు మీరు ఫ్రీ సీట్లు ఇస్తామని చెప్పారా అని ప్రశ్నించారు. వేలకోట్లు ఉన్న మీరే పిల్లలకు హామీ ఇవ్వరని, అలాంటప్పుడు రైతులు భూమిని ఎలా ఇస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి అన్నారు.
చంద్రబాబు రాజధాని మాస్టర్ ప్లాన్లో ఎక్కడా పేదవాళ్ల కోసం ఇల్లు లేదన్నారు. అన్నీ ఉన్నవారి కోసం భవంతులే అన్నారు. చంద్రబాబు గొప్పోళ్ల రాజధాని కట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రైతులను బెదిరించి భూములు తీసుకుంటున్నారన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు మరోసారి ప్రధాని మోడీ ముందు మోకరిల్లారన్నారు. ఈ నెల 29న బందుకు అందరు సహకరించాలని, బందులో పాల్గొనని వారు ఏపీ అభివృద్ధికి వ్యతిరేకులన్నారు.
వైయస్ ఫోటో ఉంటే గుండెల్లో గుచ్చుకుంటోందట
అసెంబ్లీ ప్రాంగణంలో పంచెకట్టుతో ఉన్న వైయస్ ఫోటోను ఏపీ ప్రభుత్వం తీసేసిందని, రైతు బాంధవుడు అయిన వైయస్ ఫోటో తీయడమే చంద్రబాబు రైతు వ్యతిరేకి అనేందుకు నిదర్శనం అన్నారు. అక్కడ వైయస్ ఫోటో చూసి టిడిపి నేతల పంచెలు తడిసిపోతున్నాయన్నారు.
వైయస్ నవ్వుతూ ఉన్న ఫోటో చూస్తే టిడిపి నేతలకు ఏడుపు వస్తోందన్నారు. పంచెకట్టులో ఉన్న వైయస్ను చూస్తుంటే తాము ఎగ్గొట్టిన రుణమాఫీ, రైతులకు కొత్త లోన్లు ఇవ్వని తమ తీరు, భూములు లాక్కుంటున్న తీరు టిడిపికి గుర్తుకొచ్చి.. వారి మనసులను గుచ్చుకుంటోందని, అందుకే ఫోటో తీసేశారన్నారు.
మహిళా వ్యతిరేకి చంద్రబాబు ఎలా అంటే..
చంద్రబాబు మహిళా వ్యతిరేకి అని రోజా అన్నారు. నిన్న చంద్రబాబు మాట్లాడుతూ.. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని సామెత చెప్పారని, తద్వారా.. ఒక సీఎంగా కొడుకులను కనాలని స్పీచ్ ఇస్తున్నాడంటే అతను ఎంత మహిళా వ్యతిరేకియో అర్థం చేసుకోవచ్చన్నాడు.
అసెంబ్లీని చుట్టుముట్టిన మహిళలను కొట్టించాడని, రిషికేశ్వరి ఆత్మహత్యకు కారకుల పైన చర్యల్లేవని, ఆమె కుటుంబానికి న్యాయం జరగలేదని, వనజాక్షి పైన దాడి జరిగితే చర్యలు తీసుకోలేదని.. ఇవన్నీ చంద్రబాబు మహిళా వ్యతిరేకి అనేందుకు నిదర్శనం అన్నారు. అలాంటి మహిళా వ్యతిరేకి బాబుకు బుద్ధి చెప్పాలన్నారు.
వైయస్ కంటే ధీటుగా జగన్ పాలిస్తారు: పెద్దిరెడ్డి
వైయస్ రాజశేఖర రెడ్డి కంటే ధీటుగా జగన్ పరిపాలించగలరని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో మూడు పంటలు పండే భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. తాము రాజధానికి వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్నామన్నారు.