హోంమంత్రి వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు..హైదరాబాదుకు టీడీపీ అధినేత
అమరావతి: ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నంతవరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అన్నారు. దేవుని ఆశీస్సులు ఉండటంతోనే నాడు అలిపిరి దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డట్టు గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు బాబు. ఉండవల్లిలోని తన నివాసంలో పలువురు సీనియర్ టీడీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని చెప్పిన చంద్రబాబు గత ఐదువారాలుగా రాష్ట్రంలో దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు.
శాంతిభద్రతలు రాష్ట్రంలో ఉంటేనే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా ముందుకొస్తారని చంద్రబాబు చెప్పారు. అయితే రాష్ట్రంలో ఎన్నో జరుగుతుంటాయని అన్నిటికీ కాపలా ఉండాలా అన్న హోంమంత్రి సుచరిత వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుబట్టారు. అలా మాట్లాడితే సామాన్యుడికి రక్షణ ఎవరు కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇక చంద్రబాబుకు కష్ట సమయాల్లో అండగా తాముంటామంటూ రాజధాని రైతులు వచ్చారు.
చంద్రబాబు రాజధాని ప్రాంతంలోనే ఉండాలంటూ నినాదాలు చేశారు. వారితో మాట్లాడిన చంద్రబాబు తనపై అభిమానం చూపేవారున్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. అవసరమైతే తమ భూములు ఉచితంగా చంద్రబాబు కొత్త నివాసం కోసం ఇస్తామని రైతులు చెప్పారు. మరోవైపు సీనియర్ టీడీపీ నాయకులు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు చంద్రబాబును కలిశారు. చంద్రబాబును గుంటూరుకు రావాల్సిందిగా కోరామని చెప్పారు. అవసరమైతే తన ఇంట్లో ఉండమని ఆహ్వానం పలికినట్లు రాయపాటి చెప్పారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు శుక్రవారం రాత్రికి హైదరాబాదుకు చేరుకున్నారు. ఇక రెండ్రోజుల పాటు ఆయన హైదరాబాదులోనే ఉండనున్నారు.