కేంద్రం నిధులిస్తేనే...పోలవరం పునరావాసం పనులు:చంద్రబాబు సంచలనం
పశ్చిమ గోదావరి:కేంద్ర ప్రభుత్వం నిధులిస్తేనే పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన మిగిలిన భూసేకరణ, పునరావాసం పనులు చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పేశారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద ప్రాజెక్టు వద్ద పైలాన్ను ఆవిష్కరణ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
నిధుల కోసం రైతులు కూడా కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేవాలని చంద్రబాబు కోరారు. 2019 డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు పనులను అడ్డుకోవాలని వైసిపి రకరకాలుగా ప్రయత్నిస్తోందన్నారు. పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలోనే నవయుగ కంపెనీ పాత ధరలకే నిర్మాణ పనులు చేపట్టిందన్నారు. నిధుల కోసం రైతులు కూడా కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేవాలని ఆయన కోరారు.
2019 నాటికి...పూర్తి
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద ప్రాజెక్టుకు సంబంధించిన డయాఫ్రం వాల్ పునాది పనులు పూర్తయిన సందర్భంగా సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. స్పిల్వే చానల్ నిర్మాణ ప్రాంతంలో రైతులతోనూ, అనంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని చెప్పారు. రెండు కోట్ల ఎకరాల భూమికి నీరందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో వివిధ నీటి ప్రాజెక్టులను చేపట్టామని పునరుద్ఘాటించారు.
భూ సేకరణ...ఇంకా కావాలి
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం లక్షా 68 వేల213 ఎకరాల భూమి అవసరమవ్వగా,ఇప్పటివరకూ లక్షా 10 వేలా 335 ఎకరాల భూమిని సేకరించామన్నారు. మరో 55,658 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. ఇప్పటివరకూ భూసేకరణకు సంబంధించి 6,370 కోట్లు వెచ్చించామన్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు రూ.21,027 కోట్లు అవసరమని తెలిపారు. ఇప్పటివరకూ పునరావాసం కోసం రూ.13,750 కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి రూ.1400 కోట్లు ఇటీవల కేంద్రం విడుదల చేసిందని, అప్పటికే మూడు వేల కోట్లు తాము ఖర్చు చేశామని చెప్పారు.
మొత్తం రూ. 57,000 కోట్ల ఖర్చు...
హెడ్వర్క్స్కు సంబంధించి 52.3 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. స్పిల్వే పనులు ఊపందుకున్నాయన్నారు. ఇప్పటివరకూ ప్రాజెక్టుకు సంబంధించి 55.12 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రూ.57 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. దీనిలో ఐదు వేల కోట్లు పవర్ ప్రాజెక్టుకు, రూ.28 వేల కోట్లు పునరావాసం, భూసేకరణకు ఖర్చవుతుందన్నారు. పోలవరం పూర్తి చేయాలన్న తన జీవితాశయం పూర్తయ్యిందని అన్నారు. దేశంలోనే అతి పెద్దది, ఆఖరిది పోలవరం ప్రాజెక్టే అని అన్నారు. బావర్, ఎల్అండ్టి, నవయుగ, ట్రాన్ట్రారు కంపెనీలు లాభాపేక్షతో కాకుండా ప్రజా ప్రయోజనం కోసం పని చేస్తున్నాయన్నారు.
రికార్డు స్థాయిలో...పనులు
చైనాలోని త్రీ గోడ్జెస్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ప్రాజెక్టులను మించిన వేగంతో ఇక్కడి పనులను పూర్తి చేసేందుకు కంపెనీలు బాగా కృషి చేస్తున్నాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కాంక్రీట్ పనులను నవయుగ కంపెనీ చేపట్టిందని, 11,158 క్యూబిక్ మీటర్ల పని ఒక్కరోజులోనే పూర్తి చేసి కొత్త రికార్డు సృష్టించిందని అన్నారు. త్వరలో 13 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని ఒక్కరోజులోనే చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర జీవనాడి అని, అందుకే దీన్ని అందరికీ అంకితం చేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు.
54 ప్రాజెక్టుల నిర్మాణం
ఈ ఏడాది డిసెంబరు నెలాఖరుకు పోలవరం లెఫ్ట్ కెనాల్ పూర్తి చేసి, ఏలేరు ప్రాజెక్టులో 24 టిఎంసిలు నీరు నిలువ ఉంచుతామని చెప్పారు. అక్కడి నుంచి నీటిని విశాఖ తరలించి, మార్చి నాటికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం 54 ప్రాజెక్టులను నిర్మించాలననే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని, వాటిలో ఇప్పటికే 9 పూర్తయ్యాయని చంద్రబాబు చెప్పారు. మరో ఆరు, ఏడు ప్రాజెక్టులు పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయని తెలిపారు. మరో 27 ప్రాజెక్టులను వచ్చే ఏడాది ఆగస్టులోపు పూర్తి చేస్తామన్నారు. త్వరలో గోదావరి, పెన్నా, నాగావళి, వంశధార నదులను అనుసంధానం చేస్తామని చంద్రబాబు చెప్పారు.