విష వాయువు పరిష్కారం ఎప్పుడు.?దాంతో కూడా సహజీవనం చేయమంటారా.?మరోసారి ప్రశ్నించిన పవన్..!
అమరావతి/హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైయస్సార్సీపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ విషవాయువు బాదితుల సంక్షేమం విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసారు. విశాఖపట్నం ఎల్.జి. పాలిమర్స్ మృత్యు వాయువు స్టైరిన్ లీకేజీ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు, ప్రాణాపాయం నుంచి బయటపడిన వారికి పరిహారం ఇచ్చారుగానీ, ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కల నివసిస్తున్న 15వేల మంది ప్రజల జీవన్మరణ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు పరిష్కారం చూపలేకపోయిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు. కరోనాతో కలిసి జీవించే పరిస్థితి తప్పదని చెబుతున్న ప్రభుత్వం, స్టైరిన్ అనే మృత్యు వాయువుతో సహజీవనం చేయవలసిందేననే సంకేతాలిస్తోందని మండిపడ్డారు.
దయనీయంగా మారిన గ్యాస్ బాధితుల జీవనం..
ఆర్.ఆర్.వెంకటాపురం పరిసర గ్రామాల వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోందో స్పష్టం ఇవ్వడం లేదని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేసారు. పదకొండు రోజుల కిందట జరిగిన ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది ఆస్పత్రుల పాలయ్యారని, పోలీసులు, కేంద్రానికి చెందిన ఎన్.డి.ఆర్.ఎఫ్. బలగాలు సకాలంలో స్పందించి అనేక మంది ప్రాణాలు రక్షించగలిగారని పవన్ తెలిపారు. లేదంటే ఫ్యాక్టరీ చుట్టుపక్కల వున్న వెంకటాపురం, వెంకటాద్రి గార్డెన్స్, నందమూరినగర్, పద్మాపురం పరిస్థితి మరింత ఘోరంగా ఉండేదని ఆందోళన వ్యక్తం చేసారు. కాగా ఎస్.సి, బి.సి. కాలనీలే కాక ఏడు కిలోమీటర్ల పరిధిలో వున్న సుమారు 15వేల మంది ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కాలం గడుపుతున్నారన్నారు పవన్.
పరిహారం ఇచ్చారు..
విషవాయువు ప్రభావిల గ్రామల ప్రజల్లో భయాందోళనలను పారద్రోలి భరోసా కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి ముఖ్యమైన అంశమని, పారిశ్రామికవేత్తలకు రక్షణ కూడా ప్రధానమైన అంశం ఐనప్పటికి, ప్రజల ప్రాణాలు అంతకన్నా ముఖ్యమని పవన్ అభిప్రాయపడడ్డారు. పరిశ్రమలను ప్రోత్సహించడానికి అన్ని రకాల అండదండలను ప్రభుత్వం అందివ్వాలని జనసేన మొదటి నుంచి అదే కోరుకొంటోందని గుర్తు చేసారు. అయితే అటువంటి అభివృద్ధి పర్యావరణ హితంగాను, ప్రజల జీవన విధానం మెరుగుపడే విధంగాను ఉండాలని కోరుకుంటుందే తప్ప ప్రజల ప్రాణాలను, పర్యావరణాన్ని పణంగా పెట్టే అభివృద్ధిని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పవన్ స్పష్టం చేసారు.
స్టైరిన్ విష వాయువుతో కూడా సహ జీవనం చేయాలా..?
అంతే కాకుండా ప్రాణాంతక గ్యాస్ ప్రమాదం కారణంగా పచ్చని చెట్లు, మూగ జీవాలు మాడి మసైపోయాయని, స్టైరిన్ ప్రమాదకరమైన గ్యాస్ అని రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలకు తెలియనిది కాదని, మరి అటువంటి గ్యాస్ ఆధారంగా నడిచే కర్మాగారం లాక్ డౌన్ కారణంగా మూసివేసి, తిరిగి ప్రారంభిస్తున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో తెలియదా అని పవన్ సూటిగా ప్రశ్నించారు. గ్యాస్ లీకేజీ మానవ తప్పిదం, తగిన రక్షణ చర్యలు పాటించకపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందనడానికి చాలా రుజువులు ఉన్నాయని తెలిపారు. మరి అటువంటి ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై నమోదు చేసిన క్రిమినల్ కేసులను చూసి నిపుణులు సైతం నివ్వెరపోతున్నారని పవస్ ,విస్మయాన్ని వ్యక్తం చేసారు.
Recommended Video
విషవాయువు బాదితులకు భరోసా కల్పించండి..
అంతే కాకుండా స్టైరిన్ గ్యాస్ పీల్చినవారు భవిష్యత్తులో ఎదుర్కొనబోయే ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలంగా వెంటాడే అవకశాలు ఉన్నాయని పవన్ విచారాన్ని వ్యక్తం చేసారు. కాన్సర్, కంటి చూపు, ఊపిరితిత్తుల సంబంధమైన వ్యాధులు, మెదడుపై ప్రభావం, తరచు తలనొప్పి, నిస్సత్తువ, మానసిక ఆందోళన వంటి రుగ్మతలకు లోనయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. ఇటువంటి ముప్పు పొంచి ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీ చుట్టు పక్కల వున్న 15వేల మందికి ఎటువంటి ఆరోగ్య భరోసా కల్పిస్తారో ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేసారు. పరిహారం చెల్లింపుల్లో కూడా కొన్ని దోషాలు ఉన్నట్లు ఆరోపణలు నిపిస్తున్నాయన్నారు.వీటన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు.