ల్యాప్ టాప్ లు, సెల్ ఫోన్లే కాదు కోర్టులు కావాలని అడగండి
ల్యాప్ టాప్ లు, సెల్ ఫోన్ లు కావాలని అడిగే మీరు న్యాయస్థానాలు కావాలని ప్రభుత్వాలను అడగాలని సుప్రీంకోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ప్రజలను కోరారు.
విజయవాడ:న్యాయస్థానం కావాలని ప్రభుత్వాన్ని ఎప్పుడైనా కోరారా....పెండింగ్ లో ఉన్న కేసుల గురించి మమ్మల్ని ప్రశ్నిస్తారు. కాని పాలకులను న్యాయస్థానాలు కావాలని అడగండి అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ప్రజలను కోరారు.
విజయవాడలోని సిద్దార్థ అకాడమీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వర్ రావు తండ్రి లావు వెంకటేశ్వర్ రావు ఎండోమెంట్ లెక్చర్ లో రాజ్యాంగ విలువలను పెంపొందించడంలో సుప్రీంకోర్టు పాత్ర అనే అంశంపై ఆయన ప్రసంగించారు.
ల్యాప్ ట్యాప్ లు కావాలి సెల్ పోన్లు కావాలని ప్రజా ప్రతినిధులను అడుగుతారు. కాని, న్యాయస్థానాలు కావాలని ఎప్పుడైనా ప్రజా ప్రతినిధులను అడిగారా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు.
న్యాయస్థానాల్లో రిట్ పిటిషన్లు, కేసులు, పెండింగ్ లో ఉన్న విషయాన్ని ఇంద్రనీల్ అనే విధ్యార్థి వేసిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా చట్టాలను తయారు చేసుకోవడంతో రిట్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు.
దేశంలోని జనాభాకు తగినట్టుగా న్యాయస్థానాలు లేవన్నారాయన. 1950 లో సుప్రీంకోర్టులో ఎనిమిదిగా ఉన్న న్యాయమూర్తుల సంఖ్య ప్రస్తుతం 31కి పెరిగినా ఇంకా ఖాళీలున్నాయని చెప్పారు.
సుప్రీంకోర్టుకు వస్తోన్న కేసుల్ని పరిష్కరించాలంటే ఒక్కో న్యాయమూర్తి ఏడాదికి 2500 కేసులను పరిష్కరించాల్సి ఉంటందన్నారు. ఇది సాధ్యమేనా అని ఆయన ప్రశ్నించారు. న్యాయ శాఖకు ప్రభుత్వాలు బడ్జెట్ లో ఇస్తోన్న నిధుల కేటాయింపు ఒక్కశాతానికి కూడ మించడం లేదన్నారు.
న్యాయవాద వృత్తిలో ప్రమాణాలు తగ్గిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.