ఆ సినిమాతో చంద్రబాబు ప్రభుత్వంపై హరికృష్ణ ఆగ్రహం, వైయస్ రాజశేఖర రెడ్డి హామీ!
హైదరాబాద్/అమరావతి: నందమూరి హరికృష్ణ ప్రజల సమస్యలపై స్పందించేవారని, ముఖ్యంగా రైతుల సమస్యలపై తీవ్రంగా స్పందించేవారని గుర్తు చేసుకుంటున్నారు. ఈ మేరకు ప్రముఖ దర్శకుడు వి సముద్ర ఆయనను గుర్తు చేసుకున్నారు.
ఆమెనే పెళ్లి చేసుకున్న హరికృష్ణ: వస్తానో రానో.. హోటల్ నుంచి వెళ్తూ వ్యాఖ్యలు
వైయస్ రాజశేఖర రెడ్డి మాట్లాడారు
రైతుల సమస్యలపై తాను ఏదో చేయాలనుకున్నానని, కానీ జరగలేదని ఆయన బాధపడేవారని, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఓ సమయంలో ఆయనతో మాట్లాడారని సముద్ర గుర్తు చేసుకున్నారు. మన ప్రభుత్వం వచ్చాక రైతులకు మంచి చేద్దామని హరికి వైయస్ హామీ ఇచ్చారని తెలిపారు.
ఆ సినిమాను తీశాం
రైతు సమస్యలపై 2003లో హరికృష్ణ కథానాయకుడిగా టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ సినిమా తీశామని, అందులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించామని తెలిపారు. ఈ విషయంలో తాను, పోసాని కృష్ణమురళి కలిసి ఎంతో పరిశోధన చేశామని చెప్పారు.
హరికృష్ణకు ఫోన్ చేసిన వైయస్
ఈ ప్రభుత్వాలు ఏవీ కూడా రైతులను పట్టించుకోవడం లేదని, వారి సమస్యల విషయంలో కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టి వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాయని హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేసేవారని అన్నారు. తాము తీసిన టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ సినిమాను చూసిన నాటి ప్రతిపక్ష నేత వైయస్ రాజశేఖర రెడ్డి... హరికృష్ణను ఫోన్లో పలకరించారని తెలిపారు.
వైయస్ స్వయంగా అభినందించారు
రైతు సమస్యలపై సినిమా తీసినందుకు హరికృష్ణకు స్వయంగా ఫోన్ చేసి వైయస్ అభినందించారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, మీ సినిమాలో చూపిన రైతు సమస్యలను పరిష్కరిద్దామని హామీ ఇచ్చారని తెలిపారు. రైతుల సమస్యలను ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాన అస్త్రంగా వాడిన వైయస్ నాటి ఎన్నికల్లో గెలిచారని గుర్తు చేశారు. కాగా, నాడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే.