గరుడ శివాజీ ఎక్కడ..ఎన్నికల తరువాత : ఛీటింగ్ వ్యవహారం: సీబీఐ దర్యాప్తునకు డిమాండ్..!
గరుడ పురాణం శివాజీ ఎక్కడ. ప్రస్తుతం టీవీ9 వ్యవహారంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. పోలీసులు నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదు. ఎన్నికల ముందు ఏపీలో రాజకీయంగా టీడీపీకి మద్దతు పలికిన శివాజీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. శివాజీ వ్యవహారంలో వైసిపి ఎంపీ విజయ సాయిరెడ్డి కొత్త పాయింట్ తెర మీదకు తెచ్చారు. ఆయన చెప్పేది ఛీటాంగ వ్యవహారని..సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నికల తరువాత శివాజీ ఎక్కడ..
ఏపీలో ఎన్నికల ముందు అనేక అంశాలతో శివాజీ మీడియా ముందుకు వీడియో ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్ష చేసిన సమయంలో హడావుడి చేసిన శివాజీ ఆ తరువాత ఏపీలో అనేక అంశాల మీద మాట్లాడారు. ఆపరేషన్ గరుడ పేరుతో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో గరుడ శివాజీగా అందరూ పిలవటం మొదలైంది. ఇక, ఎన్నికల సమయంలో కేసీఆర్ ఏపీ పైన చేస్తున్న కుట్ర అంటూ కొత్త విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. ఏపీలో చంద్రబాబు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. అయితే, ఏపీలో ఎన్నికలు పూర్తయిన తరువాత మాత్రం శివాజీ ఒక వీడియో సందేశం మినహా బయటకు రాలేదు. టీడీపీ గెలవాలని..చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించే శివాజీ ఇప్పుడు ఎక్కడ ఉన్నరానే ప్రశ్నకు మరో కారణం ఉంది.
టీవీ9 వ్యవహారంలో శివాజీ ..
టీవీ9 లో మేజేన్మెంట్ మార్పు సందర్భంగా తెర పైకి వచ్చిన వివాదంలో రవి ప్రకాశ్తో పాటుగా శివాజీ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఈ కేసులో తమ ముందు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చినా రవి ప్రకాశ్, శివాజీ హాజరు కాలేదు. రవిప్రకాశ్ వ్యక్తిగత విచారణకు మరో పది రోజుల సమయం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది పోలీసులను కోరినట్టు తెలిసింది. పరారీలో ఉన్న శివాజీకి మరోసారి నోటీసు జారీ చేసి విచారణకు హజరుకాకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. రవి ప్రకాశ్ ఇప్పటికే ఈ వ్యవహారంలో వివరణ ఇవ్వటంతో పాటుగా సంస్థ సీఈఓగా తొలుగుతున్నట్లుగా లేఖ విడుదల చేసారు.అయితే, సంస్థలో వాటా దారుడిగా మాత్రం కొనసాగుతానని స్పష్టం చేసారు.
సీబీఐ విచారణ చేయాలి..
ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కొత్త పాయింట్ లేవనెత్తారు. ఒక ట్వీట్లో ఆయన టివి9 రవిప్రకాష్ , గరుడ పురాణం శివాజీ మద్య జరిగింది చీటింగ్ వ్యవహారం అవుతుందని అబిప్రాయపడ్డారు. రవిప్రకాశ్ తనకు టీవీ9 షేర్లు అమ్మి బదిలీ చేయడం లేదని కంపెనీస్ లా ట్రిబ్యునల్కు శివాజీ ఫిర్యాదు చేసింది నిజమైతే.. చీటింగ్ కేసు అవుతుందని పేర్కొన్నారు. రవి ప్రకాశ్ తనకు టీవీ9 షేర్లు అమ్మి బదిలీ చేయడం లేదని గరుడ శివాజీ కంపెనీస్ లా ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేశాడంటున్నారని... ఇది చీటింగ్ కేసు అవుతుందని వివరించారు. ట్రిబ్యునల్ ఆ ఫిర్యాదుపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. అయినా, తెల్ల కాగితం మీద షేర్ల అమ్మకం అగ్రిమెంట్ రాసుకోవడమేంటో అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు.