lockdown:కరోనాను కూడా కాసులపంటగా మార్చేవారు, చంద్రబాబుపై జోగిరమేశ్ విసుర్లు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ఫైరయ్యారు. విపత్తులను కూడా తనకు అనుకూలంగా మలచుకోవడంలో దిట్ట అని విమర్శించారు. గతంలో హుదూద్ తుఫాన్ను కూడా అనుకూలంగా మార్చుకున్నారని గుర్తుచేశారు. దేవుని దయవల్ల ఇప్పుడు సీఎంగా లేరు అని.. ఒకవేళ ముఖ్యమంత్రిగా ఉంటే కరోనాను కూడా కాసులపంటగా మార్చేవారు అని సెటైర్లు వేశారు. ఏపీలో ప్రతిపక్షం లేదు అని.. క్వారంటైన్లో ఉంది.. శాశ్వతంగా క్వారంటైన్లోకి వెళుతోందని అని జోస్యం చెప్పారు.
చంద్రబాబు ఎక్కడ..
రాష్ట్రంలో వైరస్ ప్రబలుతోన్న క్రమంలో వైసీపీ నేతలంతా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై సూచనలు చేస్తున్నారని జోగి రమేశ్ చెప్పారు. మరి ప్రతిపక్ష నేత ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించారు. హైదరాబాద్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నారు అని చంద్రబాబును నిలదీశారు. మీరు ఇక్కడ ఉండరు, మీ నేతలు ఇళ్లకే పరిమితం అవుతారు.. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్న వైసీపీ నేతలపై విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షం క్వారంటైన్లోకి వెళ్లిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రతిపక్ష నేత కూడా లేరు అని పేర్కొన్నారు. పనికిరాని పక్షంగా ప్రతిపక్షం తయారైందని ఫైరయ్యారు.
ఏనాడైనా పట్టించుకున్నారా..?
ప్రతీ రోజు వేల మందికి కరోనా వైరస్ పరీక్షలు చేస్తున్నామని... ప్రజలతో వైసీపీ నేతలు కలిసి సమస్యలు తెలుసుకుంటున్నారని జోగి రమేశ్ తెలిపారు. ప్రజల్లో భయాన్ని పారదోలేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సీఎం జగన్ ఆదేశాలతో వైసీపీ నేతలంతా ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నారని తెలిపారు. స్వీయ నియంత్రణ పాటించాలని, సామాజిక దూరం పాటించాలని కోరుతున్నారని గుర్తుచేశారు. ప్రజలకు దూరంగా ఉంటోన్న నేతలు మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడే కాదు ఎప్పుడైనా టీడీపీ నేతలు ప్రజల కష్టాలను పాలుపంచుకున్నారా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం చేసే మంచి పనిని అభినందించకపోగా.. రాళ్లు వేయడం సరికాదని హితవు పలికారు.
Recommended Video
చూడలేని స్థితిలో
కరోనా వైరస్ గురించి ఏపీ ప్రభుత్వం చేపడుతోన్న కార్యక్రమాలను దేశం మొత్తం చూస్తోందని జోగి రమేశ్ తెలిపారు. ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా అభినందించారని తెలిపారు. ఇవేమి చూడలేని స్థితిలో టీడీపీ నేతలు ఉన్నారని మండిపడ్డారు. కళ్లున్న కభోది మాదిరిగా టీడీపీ నేతలు మారిపోయారని జోగి రమేశ్ విమర్శించారు.