రాష్ట్రంలో అభివృద్ది జాడ ఎక్కడ?...ఆ భూములన్నీ ఖాళీగానే:వామపక్షాల బస్సు యాత్ర ముగింపు
విజయవాడ:రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అభివృద్ది జాడ ఎక్కడని వామపక్షాల నేతలు ప్రశ్నించారు. చంద్రబాబు, మంత్రులు వల్లిస్తున్న అభివృద్ధి జాడ తమకు ఎక్కడా కనిపించడం లేదన్నారు.
సిపిఎం,సిపిఐ రాష్ట్రం రెండు దిశల నుంచి నిర్వహించిన బస్సు యాత్రలు ముగిసిన సందర్భంగా బుధవారం ఆయా పార్టీల నేతలు విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 రోజులుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో రెండు బస్సు యాత్రలు నిర్వహించామని, ఆయా ప్రాంతాల పర్యటనలో ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నామని చెప్పారు.
బస్సుయాత్రల ముగింపు సందర్భంగా విజయవాడ సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య తదిదరులు మాట్లాడారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి మంత్రులు పదే పదే ఊదరగొడుతున్న అభివృద్ధి జాడలు రాష్ట్రంలో తమకు ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. రైతుల నుంచి బలవంతంగా సేకరించిన లక్షలాది ఎకరాలు, దళితుల నుంచి గుంజుకున్న అసైన్డ్ భూములు ఖాళీగా పడి ఉన్నాయని...పరిశ్రమలు స్థాపించి, యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ ప్రభుత్వం 7 లక్షల 64 వేల ఎకరాలను సేకరించామని, అందులో 7 లక్షల 36 వేల ఎకరాలను వివిధ కంపెనీలకు కేటాయించినట్లు ప్రచారం చేస్తోందన్నారు. అయితే సేకరించిన దానిలో మూడోవంతు కూడా పరిశ్రమలు స్థాపించలేదన్నారు. ఇదే భూమిని సాగు చేస్తే రూ. 4 వేల కోట్ల వ్యవసాయ ఉత్పత్తి వచ్చి ఉండేదని...25 వేల మందికి ఉపాధి లభించేదన్నారు. సెజ్ల పేరుతో నెల్లూరు జిల్లాలో 75 వేల ఎకరాలు సేకరించగా 55 వేల ఎకరాలు, అనంతపురంలో 22 వేల ఎకరాలు సేకరించగా 22 వేల ఎకరాలు, శ్రీ సిటీలో 3,500 ఎకరాలు, ధర్మల్ ప్రాజెక్టుకు కేటాయించిన 30వేల ఎకరాల్లో 25 వేల ఎకరాలు ఖాళీగా ఉన్నాయన్నారు. రాజధాని కోసం తీసుకున్న భూమిలో వేలాది ఎకరాలు సింగపూర్ కంపెనీకి ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు.
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య మాట్లాడుతూ ఎపి ప్రభుత్వం వేల ఎకరాలు సేకరించినప్పటికీ చంద్రబాబుకు భూ దాహం తీరడం లేదన్నారు. ఇప్పటికే 7 లక్షల ఎకరాలను సేకరించిన ప్రభుత్వం మరో 8 లక్షల ఎకరాలు సేకరించాలని చూస్తోందన్నారు. తీసుకున్న భూమిని నిరుపయోగం చేసి రైతుల పొట్ట కొట్టారన్నారు. నెల్లూరులో కిసాన్ సెజ్ను ప్రవేటు సంస్థలకు ఎందుకు అప్పగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కీలకమైన రామాయపట్నం, దుగరాజపట్నం పోర్టులను ప్రభుత్వ రంగంలోకి తీసుకురావాలన్నారు. తీసుకున్న భూముల్లో పరిశ్రమలు స్థాపిస్తారా లేదా రైతులకు సాగుకిస్తారో తేల్చుకోవాలన్నారు. రైతాంగానికి వెన్నుదన్నుగా ఉండాల్సిన ప్రభుత్వమే రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తే సహించబోమని రావుల వెంకయ్య హెచ్చరించారు.
రైతుల భూములు కార్పొరేట్ కంపెనీల భూములుగా మారిపోయాయని సిపిఎం,సిపిఐ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎంత భూమి సేకరించారు, పెట్టుబడులెన్ని వచ్చాయి, ఎన్ని కంపెనీలు స్థాపించారు, ఎంత మందికి ఉపాధి కల్పించిందీ వివరిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము నిర్వహించబోయే మహాగర్జన బహిరంగ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలి రావాలని, రాజకీయ ప్రత్యామ్నాయానికి మద్దతునివ్వాలనీ ఈ సందర్భంగా కోరారు.