ఆ జోష్ ఏమైంది: యామిని సాధినేని ఎక్కడ... సోషల్ మీడియాలో తెగవెతికేస్తున్న అభిమానులు
Recommended Video
ఆమె తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తున్నారు. సరైన సమయంలో సరైన కౌంటర్లతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించగల సత్తా ఉన్న వ్యక్తి. పార్టీ తీర్థం పుచ్చుకున్న అనతి కాలంలోనే ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబునే తన వాగ్ధాటితో ఆకట్టుకున్న మహిళ. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా ఆమె తెగ పాపులారిటీ సంపాదించారు. ఎన్నికలకు ముందు టీడీపీలో ఫైర్ బ్రాండ్గా ముద్ర వేసుకున్న ఆమె.. ఎన్నికల తర్వాత కూడా కొద్దిరోజులు కనిపించారు. ఇప్పుడు అసలకే మాయమయ్యారు... ఇంతకీ ఆమె ఎవరో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది.
అనతి కాలంలోనే క్రేజ్ సంపాదించుకున్న యామిని
యామినీ శర్మ అలియాస్ సాధినేని యామిని... ఈ తరం రాజకీయాలను క్లోజ్గా ఫాలో అవుతున్నవారికి పరిచయం అక్కర్లేని పేరు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో సాధినేని యామిని పేరు ఎక్కడా వినిపించలేదు కనిపించలేదు. 2019 ఎన్నికలకు ఒక్క ఏడాది ముందు ఈ ఫైర్ బ్రాండ్ ఎవరో తెలుగు రాష్ట్రాలకు తెలిసింది. అప్పటి వరకు న్యూజెర్సీలో టీడీపీ ఎన్ఆర్ఐ వింగ్లో పనిచేసేది. గుంటూరు జిల్లాకు చెందిన యామిని ఎన్ఆర్ఐ. ఇక ఏపీలో ఎన్నికలు వస్తున్నాయనగా ఆమె ఆంధ్రాలో అడుగుపెట్టారు. ఇటు రాష్ట్రంలో వైసీపీని, అటు కేంద్రంలో బీజేపీలను టార్గెట్ చేస్తూ మీడియా సమావేశాలు నిర్వహించారు.
అడగకముందే అధికార ప్రతినిధి హోదా ఇచ్చిన చంద్రబాబు
కష్టపడే వారికే టీడీపీలో పదవులు అనే విషయాన్ని పసిగట్టిన యామిని సాధినేని... తన వాగ్ధాటితో ఏకంగా చంద్రబాబునే ఆకట్టుకుంది. ఇంకేం... అడగకముందే టీడీపీ అధికార ప్రతినిధి హోదాను యామిని సాధినేనికి చంద్రబాబు ఇచ్చేశారు. ఇక అప్పటి నుంచి జగన్, మోడీ, పవన్కళ్యాణ్, కేసీఆర్లపై విరుచుకుపడేది. ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను వ్యక్తిగతంగా సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారు. ఆ సమస్య సమిసిపోయిన తర్వాత వైసీపీ, బీజేపీలనే ప్రధానంగా టార్గెట్ చేశారు యామిని. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రాన్ని పదేపదే టార్గెట్ చేయడం, జగన్ పై సోషల్ మీడియాలో సెటైర్లు వేయడంలాంటివి చేశారు. ఇక ఆమె స్థాయి ఎంతవరకు వెళ్లిందంటే ఒకానొక సందర్భంలో యామిని సాధినేనికి టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తారన్న ప్రచారం జరిగింది. టికెట్ తనకు కేటాయించాలంటూ తన వర్గంవారిని రెచ్చగొట్టే ఆడియో సంభాషణ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే అది యామిని సాధినేనిదా కాదా అనేది అధికారికంగా ధృవీకరణ కాలేదు.
బీజేపీలోకి టీడీపీ ఎంపీలు మారిన నోరుమెదపని యామిని
ఇక ఈ మధ్యే తనను సోషల్ మీడియా వేదికగా పలువురు మానసిక వేదనకు గురిచేస్తున్నారంటూ డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఇక అదే ఆమె కనిపించిన చివరిసారి. ఇక ఆతర్వాత సాధినేని యామిని ఎక్కడా కనిపించ లేదు. ప్రతి కౌంటర్కు తిరిగి కౌంటర్ ఇచ్చే ఈ మహిళా ఫైర్ బ్రాండ్... టీడీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని తెలిసినప్పటికీ ఆమె ఒక్క మీడియా సమావేశం కూడా నిర్వహించలేదు. యామినీ సాధినేని ఎక్కడుందనేది తెలుగు తమ్ముళ్లు కూడా చర్చించుకుంటున్నారు. ఎన్నికలవరకు మాత్రమే యామిని ఆంధ్రాలో ఉండి... టీడీపీ ఘోర ఓటమి తర్వాత తిరిగి విదేశాలకు వెళ్లిపోయారా అనే చర్చ జరుగుతోంది.
యామినికోసం సోషల్ మీడియాలో ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్
మొత్తానికి యామినీ సాధినేని కోసం సోషల్ మీడియాలో తన అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. సొంత ఎంపీలు పార్టీ మారడంపై ఆమె ఎలాంటి కౌంటర్ ఇస్తుందో అనేదానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన వాక్చాతుర్యంతో అనతికాలంలోనే చాలామందిని ఆకట్టుకున్న యామిని... చివరిసారిగా ట్విటర్లో జూన్ 10న తన ఫిర్యాదు లేఖను పోస్టు చేశారు. ఇక ఆ తర్వాత యామిని కనిపించలేదు.