కడప గడపలో తొడగొట్టేది ఎవరు.? తడబడేది ఎవరు..? కొనసాగుతున్న ఉత్కంఠ..!!
అమరావతి/హైదరాబాద్ : కడప జిల్లా అంటే గుర్తొచ్చేది వైఎస్సార్ కుటుంబం. పులివెందుట పేరు వింటే, వైఎస్ రాజశేఖర్రెడ్డి మాత్రమే గుర్తుకు వచ్చేంత అనుబంధం. రాజారెడ్డి నుంచి రాజశేఖర్రెడ్డి.. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ పరంపరను కొనసాగిస్తూ వస్తున్నారు. వైఎస్ అంటే తమవాడే అనేంత బలమైన బావోద్వేగ బంధాన్ని ఏర్పరచుకున్నారు. అటువంటి కీలకమైన కడప జిల్లాపై పట్టు సాధించేందుకు తెలుగుదేశం పార్టీ దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉంది.. భంగపాటును చవిచూస్తూనే ఉంది. కానీ 2019ఎన్నికల్లో కడప గడపలో జెండా పాతాలని పట్టుదలతో ఉంది అదికార పార్టీ.
ఏపిలో ఆ పార్టీకి 22 ఎంపీ సీట్లు : ఎన్నికల వేళ..జాతీయ ఛానల్ సర్వే సంచలనం..!
ఆదిపత్యం కోసం ఓ పార్టీ, ఆదిక్యం కోసం మరో పార్టీ ప్రయత్నాలు..!వేడెక్కిన కడప రాజకీయం..!
అక్కడ వైఎస్ కుటుంబానికి కుడిభుజంగా వ్యవహరించే ఎంతోమంది నేతలను తమ వైపు తిప్పుకున్నారు టీడిపి నేతలు. అలా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని వైసీపీ నుంచి టీడీపీలోకి ఆహ్వానించి ఏకంగా మంత్రిని చేశారు. అది కూడా టీడీపీ నేతలు రామసుబ్బారెడ్డి, సీఎం రమేష్ వంటి ముఖ్య నేతలనుంచి వ్యతిరేకతను కాదని బాబు ఈ పని చేయటం వెనుక పెద్ద వ్యూహమే ఉందనేది ఆనాడే అర్ధమైంది. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్ దీక్ష చేశాడు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా తామే పరిశ్రమను నిర్మిస్తామంటూ చంద్రబాబు ఏకంగా శంకుస్థాపన కూడా చేసేశారు.
కడపలో ఆదిక్యం నిలుపుకునేందుకు బాబు ప్రయత్నాలు..! వైసీపి కంచుకోట అంటున్న జగన్ వర్గం..!!
కృష్ణానీటిని పులివెందుల వరకూ పారించి సీమలో కృష్ణమ్మ గలగలలు వినిపించారు. ఇప్పుడు అదే వ్యూహంతో కడప ఎంపీగా టీడీపీ ఆదినారాయణరెడ్డిని బరిలోకి దింపింది. అవినాష్రెడ్డికి ఉన్న ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుని తెలుగుదేశం జెండా ఎగురవేయాలని భావిస్తుంది. దీంతో కడప పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని బుద్వేలు, పులివెందుల, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడప, కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాలపై పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నారు తెలుగు తమ్ముళ్లు.
రెడ్డి వర్సెస్ బీసి..! కడపలో పైచేయి ఎవరిది..?
ఇటువంటి ప్రతిష్టాత్మకమైన చోట గెలుపు కోసం అక్కడ అభ్యర్థి సామాజికవర్గం వారీగా ఓటర్ల మనసు గెలవటమే కీలకం. కడప బరిలో జెండా ఎగురవేసేందుకు రెడ్డి, బీసీ ఓటర్ల తీర్పు చాలా ముఖ్యం. రెడ్డి వర్గం దాదాపు వైసీపీ వైపు మొగ్గుచూపుతుంది. బీసీల్లోనూ ఇరువైపులా సమానమైన కేడర్ ఉంది. బీసీ జయహో అంటూ టీడీపీ ప్రచారం ఏ మాత్రం కలసి వస్తుందనేది అంచనా వేయటం కూడా కష్టంగా మారుతోంది. ఎందుకంటే, ఇక్కడ ప్రధానమైన బలిజలు కూడా వైసీపీ, టీడీపీ రెండు పార్టీల వైపు చీలిపోయారు. కొన్ని నియోజకవర్గాల్లోని బలిజలు జనసేన వైపు ఆసక్తి చూపుతున్నారు.
కడపలో కీలకం కానున్న మహిళా ఓటర్లు..! ఎవరికి సై అంటారో చూడాలి..!!
ఇటువంటి కీలకమైన కడప ఎంపీ సీటు నెగ్గటంలో మహిళల ఓట్లు కూడా కీలకమే ఎందుకంటే, కడప ఎంపీ స్థానం పరిధిలో 14,56,623 ఓటరు జనాభా ఉంటే, వారిలో మహిళా ఓటర్లు 7,36,916 మంది ఉన్నారు. పురుషులు 7,19,478 మంది ఉండటమే ఇందుకు నిదర్శనం. ఈ లెక్కన పసుపు కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణాలు తమకే కలసి వస్తాయనేది సైకిల్ నేతల ఆత్మవిశ్వాసం. ఎవరొచ్చినా వైఎస్ కుటుంబంపై ప్రజల్లో ఉన్న అభిమానం.. మరోసారి వైసీపీకే మెజార్టీను కట్టబెడుతుందనేది వైసీపీ శ్రేణుల అంతరంగం. దీంతో వచ్చే ఎన్నికల్లో కగప గడపలో జెండా పాతేందుకు రెండు రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది.