అమెరికాలో సీఎం జగన్కు భారీ రుణం: లక్ష కోట్ల వరకు ఛాన్స్ : ఢిల్లీ నేతల సర్ ప్రైజ్..!
ఏపీ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి గత వారం కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర పెద్దలను, ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఏపీకి రావాల్సిన నిధులపై చర్చించారు. అయితే దీనితో పాటు మరో ముఖ్య అంశం కూడా కేంద్రం పెద్దల వద్ద చర్చించినట్లు సమాచారం. అసలే ఆర్థిక ఊబిలో చిక్కుకున్న ఏపీని గట్టెక్కించేందుకు రుణాలకు సంబంధించి ప్రస్తావించినట్లు సమాచారం. ఇప్పుడు ఇదే అంశం రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా నిలుస్తోంది. ఇంతకీ ఏపీకి భారీ మొత్తంలో రుణం ఇచ్చేందుకు ముందుకొస్తున్న సంస్థ ఏది..? బుగ్గన సూచించిన ఈ సంస్థ పై కేంద్రం ఎలా స్పందించింది..?
అమెరికా ప్రైవేట్ ట్రస్టు నుంచి భారీగా రుణం
ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గతవారం కేంద్ర పెద్దలను కలిసి ఏపీ ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. అయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై మాత్రమే చర్చించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ప్రభుత్వం తరపున బుగ్గన ఒక భారీ ప్రతిపాదన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ముందు ఉంచినట్లు సమాచారం. ఇప్పటికే ఏపీ ఆర్థిక కష్టాల్లో ఉన్న నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ ప్రైవైట్ ట్రస్టు ఆంధ్రప్రదేశ్కు భారీగా రుణం ఇచ్చేందుకు ముందుకొస్తోందని అయితే అందుకు కేంద్రం అంగీకారం తప్పనిసరి అని నిర్మలా సీతారామన్కు తెలిపినట్లు సమాచారం. ప్రైవేట్ ట్రస్టు రుణంగా ఇచ్చే ఈ నిధులపై కేంద్రం గ్యారెంటీ ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది.
భారీ రుణానికి కేంద్రం గ్యారెంటీ ఇవ్వాలంటూ..
అమెరికాలోని ప్రైవేట్ ట్రస్టు ద్వారా 1 బిలియన్ అమెరికా డాలర్లు రుణంగా పొందేందుకు బుగ్గన అనుమతులు అడిగినట్లు ముందుగా వార్తలు వచ్చాయి. అంటే మన కరెన్సీలో ఇది అక్షరాల రూ.7500 కోట్లు. కానీ వాస్తవానికి 9 బిలియన్ అమెరికన్ డాలర్లు రుణంగా ఏపీకి ఇచ్చేందుకు ముందుకొచ్చింది ఆ ప్రైవేట్ ట్రస్టు. అంటే కొన్ని మన కరెన్సీలో కొన్నిలక్షల కోట్లు అని చెప్పొచ్చు. అయితే ఈ భారీ మొత్తంలో రుణంకు కేంద్రం గ్యారెంటీ ఇవ్వాలని బుగ్గన కోరినట్లు సమాచారం. పలు అంతర్జాతీయ సంస్థల నుంచి కాకుండా ప్రైవేట్ ట్రస్టు నుంచి రుణాలు పొందాలనుకోవడంపై పలు అనుమానాలకు తావిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే అంత భారీ స్థాయిలో రుణం ఇచ్చే ప్రైవేట్ సంస్థ ఏమిటనేదానిపై మాత్రం స్పష్టత లేదు. అంతేకాదు భారత దేశ చరిత్రలోనే ఓ ప్రైవేట్ ట్రస్టు ఇంత భారీ మొత్తంలో ఏ రాష్ట్రానికి రుణాలు ఇవ్వలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆర్బీఐ, ఫెమా నిబంధనలు ఏం చెబుతున్నాయి
ఇక భారత్లో ఆర్థిక సంస్థలైన ఆర్బీఐ, ఫెమాలు కూడా విదేశీ ట్రస్టుల నుంచి ఇంత భారీ మొత్తంలో రుణాలకు అనుమతించవు. అది కూడా ఒక ప్రైవేట్ ట్రస్టు కాబట్టి అంతకంటే ఉండదు. ఇక్కడే కేంద్రం సహాయం బుగ్గన కోరినట్లు సమాచారం. ఇక గ్యారెంటీ విషయం పక్కన పెడితే అంత పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చే ప్రైవేట్ ట్రస్టు పైనే అంతా ఫోకస్ చేసి ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆ ప్రైవేట్ సంస్థ అంత భారీ మొత్తంలో రుణాలు ఇస్తుందంటే దీని వెనక ఏదో గండికోట రహస్యం ఉండనే ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇక ఇంత భారీ స్థాయిలో రుణం ఇస్తున్న ప్రైవేట్ ట్రస్టు గురించి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్, నీతిఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, నీతి ఆయోగ్ సలహాదారుడు అవినాష్ మిశ్రాలకు వివరించినట్లు సమాచారం. అయితే కేంద్రమంత్రుల నుంచి బ్యూరోక్రాట్ల వరకు బుగ్గన చెప్పిన విషయాలను విన్నారు తప్పితే ఎవరూ దీనిపై స్పష్టమైన హామీలు ఇవ్వలేదని సమాచారం.
Recommended Video
కేంద్రం ముందు ఇతర రాష్ట్రాల డిమాండ్
ఓవైపు ఈ భారీ మొత్తంలో రుణాలు పొందాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంటే మరోవైపు ఇదంతా ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే ఉండాలని కేంద్రం భావిస్తోంది. ఈ మధ్యనే ఎఫ్ఆర్బీఎం పరిధిలో ఇన్వెస్ట్మెంట్స్ పెంచేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ... ప్రైవేట్ సంస్థల నుంచి ప్రత్యక్ష విదేశీ నిధులపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విదేశాల నుంచి రుణాలు పొందడంలో కేంద్రం పలు పరిమితులను విధించింది. అంతేకాదు విదేశాల్లోని ప్రైవేట్ సంస్థల నుంచి రుణాలు పొందేందుకు గ్యారెంటీ ఇవ్వాలంటూ పలు రాష్ట్రాలు ఇప్పటికే డిమాండ్ను కేంద్రం ముందుంచాయి. కానీ కేంద్రం చాలా సందిగ్ధంలో పడిపోయింది.