ఏ ప్రొసిజర్ ప్రకారం కార్యాలయాలు తరలించాలి, డాక్యుమెంట్లు సమర్పించండి: పిటిషనర్కు హైకోర్టు ఆదేశం
అమరావతి నుంచి కార్యాలయాల తరలింపుపై ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగింది. మంగళవారం కూడా విచారణ చేపట్టిన ధర్మాసనం.. బుధవారం కంటిన్యూ చేసింది. సరైన డాక్యుమెంట్లు సమర్పించాలని పిటిషనర్ను స్పష్టంచేసింది. కార్యాలయాల తరలింపుపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదావేసింది.
అమరావతి నుంచి విజిలెన్స్ కమిషనర్ కార్యాలయం, ఎంక్వైరీ కమిషనర్ కార్యాలయం కర్నూలుకు తరలిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 13 జారీచేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం కూడా పిటిషన్ విచారించిన కోర్టు.. బుధవారం కంటిన్యూ చేసింది. అయితే పిటిషనర్పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
వాదనలకు సంబంధించి డాక్యుమెంట్లు ఇవ్వాలని స్పష్టంచేసింది. మౌఖికంగా ఎలా చెబుతారని ప్రశ్నించింది. తదుపరి విచారణ సమయంలో ధ్రువపత్రాలను సమర్పించాలని ఆదేశించింది. ఏ ప్రొసిజర్లో కార్యాలయాలు తరలించాలనే అంశంపై పిటిషనర్ డాక్యుమెంట్లను సమర్పించాలని ధర్మాసనం స్పష్టంచేసింది. ఏ కారణంతో కార్యాలయాలను తరలిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీచేసింది.