నిమ్మగడ్డ ఫ్యామిలీకి బెదిరింపులు?.. రమేశ్ కూతురు శరణ్య హాట్ టాపిక్..
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై చెలరేగిన వివాదంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్ణయాలను రద్దు చేయాలంటూ వైసీపీ సర్కారు దాఖలుచేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎస్ఈసీ నిర్ణయమే ఫైనల్ అని సుప్రీం తేల్చిచెప్పిన గంటల వ్యవధిలోనే.. ఎన్నికల నిర్వహణకు కేంద్రం సాయం కోరుతూ నిమ్మగడ్డ లేఖ రాశారని వార్తలు రావడం సంచలనంగా మారింది.
అలా ఎందుకు చెప్పారు?
ఏపీలో స్థానిక ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే పరిస్థితి లేదదని, భద్రత కోసం కేంద్ర బలగాలను పంపాలని హోం మంత్రిత్వ శాఖను ఎస్ఈసీ రమేశ్ కోరినట్లు లేఖలో వెల్లడైంది. వ్యక్తిగతంగా తనతోపాటు కుటుంబీకులకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు వార్నింగ్ ఇస్తున్నారని అందులో రాసుకొచ్చారు. తన కుటుంబీకులపై దాడి జరిగే అవకాశం కూడా ఉందని ఆయన వాపోయారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లో అమరావతిలో ఉండలేనని, హైదరాబాద్ నుంచి పనిచేసుకునేందుకు అనుమతివ్వాలని కోరారు. ఆయన ఫ్యామిలీ ప్రస్తావన తీసుకురావడం వెనుక పెద్ద కథే నడిచింది..
ఫ్యామిలీని లాగిందెవరు?
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమర్ స్థానిక ఎన్నికల్ని వాయిదా వేసిన కొద్ది నిమిషాలకే సీఎం జగన్ ప్రెస్ మీట్ పెట్టిమరీ.. టీడీపీ చీఫ్ చంద్రబాబుతో కమిషనర్ రమేశ్ కు దగ్గరి సంబంధాలున్నాయని, కుట్రపూరితంగా ఎన్నికల్ని వాయిదా వేశారని ఆరోపించారు. ఆ వెంటనే వైసీపీ నేతలు.. రమేశ్ గత చరిత్ర తోడటం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే రమేశ్ కూతురు శరణ్య పేరు ప్రముఖంగా వెలుగులోకి వచ్చింది. కేబినెట్ మంత్రులు సైతం శరణ్య పేరును ప్రస్తావిస్తూ రమేశ్ పై విమర్శలు గుప్పించారు. బహుశా ఆ కారణాల వల్లే కేంద్రానికి రాసిన లేఖలో ఆయన ఫ్యామిలీని కూడా ప్రస్తావించి ఉండొచ్చనే చర్చ నడుస్తోందిప్పుడు.
శరణ్య స్పెషాలిటీ ఏంటంటే..
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కూతురు నిమ్మగడ్డ శరణ్య ప్రస్తుతం సింగపూర్ లో కార్పోరేట్ లాయర్ గా కెరీర్ కొనసాగిస్తున్నారు. అంతకుముందు ముడున్నర సంవత్సరాల పాటు ఆమె చంద్రబాబు ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. విదేశీ సంస్థలు, వ్యక్తుల ద్వారా ఏపీకి పెట్టుబడుల్ని ఆకర్షించే క్రమంలో నాటి టీడీపీ సర్కారు‘ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు(ఈడీబీ)' పేరుతో ఓ వ్యవస్థను ఏర్పాటుచేసింది. దానికి అసోసియేట్ డైరెక్టర్ గా శరణ్య వ్యవహరించారు. ప్రభుత్వం ఖర్చులతో దేశదేశాలు తిరుగుతూ పెట్టుబడులు సంపాదించడం ఈడీబీ పని. ఇందుకుగానూ శరణ్యకు భారీ మొత్తాన్ని జీతంగా చెల్లించారని వెల్లడైంది.
Recommended Video
ప్రతిఫలంగా ఎన్నికలు వాయిదా..
సీఎం జగన్ ఆరోపణలకు తోడు, ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరో అడుగుముందుకేసి.. చంద్రబాబు ద్వారా కూతురు శరణ్య పొందిన లబ్దికి ప్రతిఫలంగానే రమేశ్ కుమార్ ఇవాళ ఎన్నికల్ని వాయిదా వేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ తన కూతురు ఒక్కదాని కోసం ఏపీలోని లక్షలాది మంది పేదల్ని బలిపెడుతున్నారని, కరోనాను బూచిగా చూపెట్టి ఎన్నికల్ని వాయిదా వేశారని మంత్రి విమర్శించారు. మొత్తంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమేశ్ కుమార్ నిర్ణయాలతో రగిలిన వేడి ఇప్పట్లో చల్లారేలా లేదు.