పవన్ కల్యాణ్ లేకుండా తొలిసారి.. కీలక తరుణంలో ఉత్తరాంద్రలో జనసేన మీటింగ్స్.. నాదెండ్ల నాయకత్వం..
గుండు సూది నుంచి గుణాత్మక మార్పు దాకా జనసేన పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలనూ అధ్యక్షుడు పవన్ కల్యాణే పర్యవేక్షిస్తారని.. ఆయనకు తెలియకుండా పార్టీలో చీమైనా కదలదని.. ప్రతి పని తన ఆధ్వర్యంలోనే జరగాలని ఆయన కోరుకుంటారనే విమర్శలకు సమాధానమిస్తూ జనసేన పార్టీ కొత్త ప్రయోగాన్ని చేపట్టింది. అధినేత పవన్ కల్యాణ్ లేకుండానే తొలిసారి కీలక సమావేశాలు నిర్వహిస్తున్నది.
Recommended Video
సోమ, మంగళవారాల్లో..
ఏపీలో అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలిచినప్పటికీ, గణనీయంగా ఓట్లు పొందిన జనసేన.. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లోని కీలక నేతలతో పవన్ మాట్లాడారు. ఈసారి జనసేనాని లేకుండానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సంస్థాగత సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జనసేన తెలిపింది.
నాదెండ్ల నాయకత్వంలో..
పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండటంతో పార్టీని నడిపించే బాధ్యతను జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో కీలక భేటీలు మనోహర్ నాకత్వంలోనే జరుగనున్నట్లు పార్టీ తెలిపింది. ఇప్పటివకు ప్రకటించిన కమిటీల సభ్యులతోపాటు ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాల ఇన్ చార్జిలు కూడా సమావేశాలకు హాజరుకానున్నారు. పార్టీకి సంబంధించిన వివిధ అంశాలు, సంస్థాగత నిర్మాణంపై ప్రధానంగా చర్చ జరుపుతారని తెలిసింది.
ఇదీ షెడ్యూల్..
జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉత్తరాంధ్రలో సోమ, మంగళవారాల్లో పాల్గొనబోయే సమావేశాల షెడ్యూల్ ను పార్టీ ప్రకటించింది. సోమవారం(ఈనెల 2) మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం ఐదు దాకా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో, మంగళవారం(మార్చి 3) ఉదయం 11 నుంచి 1 గంట వరకు విజయనగరం జిల్లా, అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు విశాఖ రూరల్ జిల్లాల్లో నాదెండ్ల సమావేశాలు నిర్వహిస్తారు. తర్వతిరోజైన బుధవారం విశాఖ అర్బన్ జిల్లా సమావేశం, ఆ తర్వాత ఉత్తరాంధ్ర సంయుక్త పార్లమెంట్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ తెలిపారు.