ఒంటికాలితో లేస్తున్న వారు ఓటమిని కూడా అంగీకరించాలి..! టీడిపి, వైసీపిలో రంకెలేస్తున్న నేతలు..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపీలో మాటల దాడి పెరుగుతోంది. అధినేతలిద్దరూ విదేశాలకు విహారయాత్రలకు వెళితే.. రాష్ట్రంలో ఉన్న నేతలు మాత్రం నోటికి విశ్రాంతిని ఇవ్వట్లేదు. ఎవ్వరూ తగ్గేలి లేదనంతగా విమర్శలు గప్పించుకుంటున్నారు. మంచి తరుణం మించిన దొరకదు అనేంతగా రెచ్చిపోతున్నారు. దీని వెనుక అసలు విషయం ఏమిటంటే.. రేపు తమ పార్టీ అధికారంలోకి వస్తే.. తమ వాగుడుకు.. ప్రత్యర్థిపై తాము చేసిన విమర్శల ధాటికి ఏదో ఒక పదవి వరించకపోతుందా.. అని బోలెడు మంది నేతలు పనిగట్టుకుని మరీ ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరి అదే నేతలు రేపు పుట్టి గల్లంతైతే బాద్యత తీసీసుకోవాలనే సూక్ష్మాన్ని గ్రహించాలి సుమీ..!!
పార్టీ అధినేతలు విహారయాత్రలకు..! స్థానిక నేతలు వివాదాలకు.. ఏపిలో వింత పరిస్థితి..!!
ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎవరికి ఎంత వరకూ మేలు చేస్తుందనేది పక్కనబెడితే.. సొంతపార్టీకు మాత్రం చేటుతెస్తే.. ఇటువంటి వాగుడుకాయల వల్లనేనంటూ విమర్శలు మొదలయ్యాయి. ఆ జాబితాలో ఇప్పుడు ఎవరైతై టీడీపీ, వైసీపీల తరపున కంకణం కట్టుకుని మరీ విమర్శలకు పాల్పడుతున్నారే వారే. పైగా.. ఇంతగా తిట్లు దండకం అందుకున్న పార్టీల్లోని నేతలు.. రేపు అధికారంలోకి వచ్చిన పార్టీలోకి జంప్ చేసేందుకు ముందు వరుసలో ఉంటారనే సెటైర్లు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
ప్రత్యర్థి పార్టీలపై చెలరేగుతున్న నేతలు..! ముందుంది ఫలితాల పండగ...!!
అప్పట్లో చిరంజీవిని ఇంద్రుడు చంద్రుడు అంటు పొగిడిన వారు వేరే పార్టీల్లోకి చేరారు. ఆ తరువాత వైఎస్ను దేవుడంటూ పొగిడిన నేతలు.. సైకిల్ ఎక్కారు. నల్లారిని సీమాంధ్ర సింహం అంటూ ప్రశంసించిన మంత్రులు తూచ్.. నల్లారి నల్లి అంటూ విసుర్లు కురిపించారు. చంద్రబాబు.. నవ్యాంధ్ర సారథి అంటూ ప్రశంసించిన వారే.. జగన్ వైపు మళ్లారు. జగన్ బాబోయ్.. అతడితో వేగటం మా వల్లకాదంటూ సన్నాయి నొక్కులు నొక్కిన బ్యాచ్ అంతా.. మళ్లీ జగన్ ఫ్యాన్ రెక్కల కిందకు చేరారు.
బరి తెగిస్తున్న ఆరోపణలు..! విచక్షణ కోల్పోతున్న నేతలు..!!
ఇటువంటి నేతల్లో వైసీపీ తరపున విజయసాయిరెడ్డి, సి.రామచంద్రయ్య, చెవిరెడ్డి, అంబటి, బొత్స, రోజా ముందు వరుసలో ఉంటారు. పార్టీకు ఏదైనా చెడు జరిగిందంటే.. ఏ టూ గా సీబీఐ కేసులున్న విజయసాయిరెడ్డేనంటూ జగన్ వర్గమే అంటోంది. టీడీపీ విషయానికి వస్తే.. బాబూ రాజేంద్రప్రసాద్, వర్ల రామయ్య, కుటుంబరావు, శివాజీ, దేవినేని ఉమా వర్గమే సూత్రదారులు అనే ముద్రపడింది. ఎందుకంటే, వీరి కామెంట్స్ చాలా ఇబ్బందికరంగా ఉండటమే కాదు.. అవతలి వారిని విమర్శించేటపుడు మనుషులమనే ఇంగితాన్ని మరిచిపోవడమే.. వాటిని ఏకంగా లైవ్ ద్వారా జనాల్లోకి చేర్చుతున్నారు. అభిమానులకు అవన్నీ జోష్ ఇచ్చేవిగానే ఉంటాయి. కాని రేపు తేడా జకరిగినప్పుడే వాటి విలువ తెలుస్తోంది సదరు నేతలకు.
విమర్శిస్తున్న నోళ్లే ఓటమి బాద్యత తీసుకోవాలి..! నియంత్రణ తప్పుతున్న ఏపి నేతలు..!!
కానీ.. సామాన్య పౌరులకు ఇవన్నీ విసుగు కలిగిస్తాయనే విషయం మరచిపోతున్నారంటూ జనం నుంచి విమర్శలు అందుకుంటున్నారు. విజయసాయిరెడ్డి, రాజేంద్రప్రసాద్ వంటి తలనెరసిన నేతలు కూడా చౌకబారు విమర్శలతో పలుమార్లు అధినేతల చేతిలో చీవాట్లు తిన్నారు. పద్దతి మార్చుకుని తమ వయసుకు తగినట్టు హుందాగా వ్యవహరించాల్సిన వీరంతా.. మరీ బజారు భాష వాడుతున్నారనే అపవాదును ఇప్పటికే మూటగట్టుకున్నారు. అందుకే సొంతపార్టీ నేతలే.. తమ పార్టీకి నష్టం కలిగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు, జగన్ కోటరీలోని వ్యక్తులు తమ నోటి దురుసు వల్ల ఎలాంటి విపత్తులు కలిగిస్తారోననే చర్చ జరుగుతోంది. వీరే పార్టీ ఓటమి బాద్యతలను కూడా రేపు నెత్తిన వేసుకోవాలనే వాదన కూడా వినిపిస్తోంది.