ప్రధాని ఇలా చేస్తే ఎలా, గాలిని రంగంలోకి దించారు: యడ్యూరప్ప రాజీనామాపై చంద్రబాబు
అమరావతి: కర్ణాటక పరిణామాలు, యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం స్పందించారు. యెడ్డీ రాజీనామా చేయడం అందరికీ సంతోషమే అన్నారు.
రాష్ట్రానికి ఓ విధానం అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధినేతలు రంగంలోకి దిగినా విఫలమయ్యారని విమర్శించారు. ఏపీకి అన్యాయం చేసిన వారిని మట్టి కరిపించాలని పిలుపునిచ్చానని చెప్పారు.
గాలి జనార్ధన్ రెడ్డి వంటి అవినీతిపరులను బీజేపీ రంగంలోకి దింపారని విమర్శించారు. వంద కోట్ల రూపాయలు, లైఫ్ సెటిల్మెంట్ చేస్తామని గాలి జనార్ధన్ రెడ్డి ఆయన వర్గం ప్రలోభ పెట్టిందన్నారు.
ప్రధాని లాంటి నేతలు అవినీతిని ప్రోత్సహిస్తే యువతకు ఏం సందేశం ఇస్తారని ప్రశ్నించారు. కర్ణాటక అయిపోయి ఉంటే రేపు ఆ తర్వాత మన పైన పడేవారని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు సాధికార మిత్ర భేటీలో ఈ అంశాలను ప్రస్తావించారు. యడ్డీ రాజీనామా అందరికీ సంతోషంగా ఉందా అని సాధికార మిత్ర భేటీలో అందర్నీ ప్రశ్నించారు. సంతోషంగా ఉందని సాధికార మిత్ర కార్యకర్తలు బదులిచ్చారు. యడ్యూరప్ప రాజీనామా ప్రజాస్వామ్య విజయమని చంద్రబాబు అన్నారు.