భయపెట్టి వెళ్లగొట్టడానికేనా?: ప్రభుత్వంపై పవన్ షాకింగ్ ప్రశ్నలు
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో మరోసారి విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన ఈ మేరకు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రశ్నించడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన జనసేనాని గత కొంతకాలంగా ప్రజా సమస్యలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను నిలదీస్తున్నారు.
కేసీఆర్ను అడుగుతా, వారికే టిక్కెట్ ఇస్తా: బాబుపై పవన్ సంచలన వ్యాఖ్యలు
Recommended Video
ప్రస్తుతం ఆయన విశాఖపట్నంలో ఉన్నారు. త్వరలో ఆయన జనసేన పోరాట యాత్ర ప్రారంభం కానుంది. తాజాగా, ఆయన ఓ ట్వీట్ చేశారు. ఉత్తరాంధ్రప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఆంత్రాక్స్ ఎవరు తీసుకు వచ్చారు?
ఆంత్రాక్స్ను ఏజెన్సీ ప్రాంతానికి ఎవరు తీసుకు వచ్చారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ కోణంలో దర్యాఫ్తు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ విచారణ సంస్థను నియమించాలని డిమాండ్ చేశారు. ట్రైబల్స్ సంక్షేమం పట్ల ఐటీడీయా అంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉంటోందని ప్రశ్నించారు.
బాక్సైట్ మైనింగ్ కోసం భయపెట్టడానికేనా?
కేవలం ట్రైబల్స్ ఉన్న ప్రాంతంలోనే ఆంత్రాక్స్ ఎలా వచ్చిందని జనసేనాని నిలదీశారు. ఇక్కడ బాక్సైట్ మైనింగ్ కోసం అనుకూల పరిస్థితులు ఏర్పడేందుకు ఆంత్రాక్స్ వచ్చిందా, ఇక్కడి ప్రజలను దీంతో భయపెట్టే ప్రయత్నాలా అని నిలదీశారు. ఉత్తరాంధ్ర వాతావరణాన్ని, సంస్కృతిని నాశనం చేసే ప్రయత్నాలని వాపోయారు.
జనసేనానికి కితాబు
బుధవారం విశాఖలో ఉత్తరాంధ్ర మేధావులతో జనసేనాని సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు మేధావులు మాట్లాడారు. పవన్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో అభివృద్ధికి బీజాలు పడతాయన్న నమ్మకం కలిగిందని కుప్పం విశ్వవిద్యాలయ మాజీ వీసీ ఆచార్య కెఎస్ చలం అన్నారు. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ఎలాంటి అభివృద్ధికీ నోచుకోక వెనకబడే ఉందన్నారు. ఇక్కడివారు పలు ప్రాంతాలకు వలస పోయారన్నారు. హైదరాబాద్ వెళ్లి అప్పలనాయుడు అని పిలిస్తే పరిసర ప్రాంతాల నుంచి పదిమంది వస్తారని, యమునానదికి వరదలు వస్తే నిరాశ్రయులవుతున్నవారిలో వేలాదిమంది ఉత్తరాంధ్రవాసులే అన్నారు. శ్రీలంక తోటల్లోను ఎక్కువగా వారే ఉంటున్నారన్నారు.
ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా చేస్తే తప్పేమిటి?
ఉత్తరాంధ్ర ప్రాంతావాసుల్లో రక్తహీనత పెరుగుతోందని, ఎముకల్లో కాల్షియం తగ్గుతోందని, ఉద్ధానంలో కిడ్నీ వ్యాధులు, గిరిజన ప్రాంతాల్లో ఆంత్రాక్స్ వ్యాధుల పరిస్థితి అలానే ఉందని, ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం లేదని శాస్త్రవేత్త దుర్గారావు వాపోయారు. అరకులో కాఫీ పంట ఉత్పత్తికి చేయూతనివ్వాలన్నారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్ వంటి చిన్న రాష్ట్రాలు ఏర్పాటయినప్పుడు ఉత్తరాంధ్రను ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే తప్పేమిటని ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ వీసీ ఆచార్య కేవీ రమణ అన్నారు.