తాడిపత్రి ఘటనలో నిందితులపై కఠిన చర్యలు, ఎవరినీ ఉపేక్షించబోం: ఎస్పీ
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్రెడ్డి ఇంటికి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులతో వెళ్లడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఘటనను సీరియస్గా పరిగణిస్తున్నామని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, హత్యాయత్నం కేసుతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని స్పష్టం చేశారు.
ఘటనా స్థలంలో ఉన్న డీఎస్పీ చైతన్య, ఎస్సై ప్రదీప్ కుమార్ తక్కువ సిబ్బందితో సమర్థవంతంగా పని చేశారని ప్రశంసించారు. లా అండ్ ఆర్డర్ అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా పోస్టులు చేసే వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. లా అండ్ ఆర్డర్కు భంగం వాటిల్లితే ఎవ్వరినీ ఉపేక్షించమని ఆయన హెచ్చరించారు.
అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయడానికి వెనుకాడబోమని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యక్తిగత న్యాయవాది శ్రీనివాసులు ఇచ్చినా సమాచారం ఫిర్యాదు గానే పరిగణించామని ఎస్పీ వెల్లడించారు. ఇటు ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేశామని తెలిపారు. ఇరు వర్గాల పిటిషన్లను స్వీకరించి.. ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. తప్పు చేసినా వారిని ఎవరినీ ఉపేక్షించబోమని వెల్లడించారు.