ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షులు ఎవరు? రేసులో వీరే: అలాగే అనూహ్యమా?
అమరావతి: భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్కు కొత్త అధ్యక్షుడి వేటలో పడింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడుగా ఎవరిని నియమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా కాపు సామాజిక వర్గంపై బీజేపీ నేతలు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.
Recommended Video
ఓ వైపు అధిష్టానం అధ్యక్షుడి ఎంపికపై దృష్టి సారించిన నేపథ్యంలో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు ఢిల్లీలో మకాం వేశారు. ఆదివారం ఢిల్లీకి వచ్చిన ఆయన పార్టీ అధ్యక్షులు అమిత్ షా, ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్లను కలవాలనుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్కు భద్రత కల్పించిన ప్రభుత్వం
తెగిపోయిన సంబంధాలు
రాష్ట్రంలో టీడీపీ, బీజేపీల మధ్య సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయడానికి అధిష్ఠానం కొత్త అధ్యక్షుడిని నియమించాలని భావిస్తోంది. పూర్తిస్థాయి కమిటీ లేకుండా తాత్కాలిక ప్రాతిపదికన కొనసాగడానికి ప్రస్తుత అధ్యక్షుడు హరిబాబు కూడా అంత సుముఖంగా లేరని తెలుస్తోంది.
అదీ బీజేపీ ఆలోచన
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీకి కొత్త అధ్యక్షుడిని నియమించినా గత నాలుగేళ్లుగా పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటుకు మాత్రం ఆయనకు అవకాశమివ్వలేదు. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో జనసంఖ్యా బలం అధికంగా ఉన్న సామాజిక వర్గానికి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టి ప్రజల్లోకి బలంగా వెళ్లాలని బీజేపీ యోచిస్తోంది.
రేసులో వీరే
ఇందులో భాగంగా పైడికొండల మాణిక్యాల రావు, ఆకుల సత్యనారాయణ, కన్నా లక్ష్మినారాయణ, సోము వీర్రాజు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మాణిక్యాల రావుకు అవకాశాలు కొంత మెరుగ్గా ఉన్నట్లుగా చెబుతున్నారు.
అనూహ్య నిర్ణయం తీసుకుంటారా
అయితే బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఇప్పటి వరకూ అన్నిచోట్లా ఎవరూ ఊహించని వ్యక్తులు, సామాజికవర్గాలనుంచి అధ్యక్షులను పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఏపీలోకూడా అలాంటిది చేయొచ్చని కొందరు భావిస్తున్నారు.