హఠాత్తుగా యూటర్న్! కొత్త అనుమానాలు, పవన్ వెనుక ఆ 'ఇద్దరు' ఎవరు?
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ యూ టర్న్ తీసుకున్నారు! నాలుగేళ్లకు భిన్నంగా టీడీపీపై, చంద్రబాబుపై తొలిసారి తీవ్రంగా స్పందించారు. గుంటూరులో జరిగిన నాలుగేళ్ల పార్టీ వేడుకలో ఆయన అధికార పార్టీనే టార్గెట్ చేసుకున్నారు.
చదవండి: జగన్! ఇప్పుడు చెప్పు: ఎప్పటిలా పవన్ కళ్యాణ్ చురకలు, నిన్న.. నేడు
పవన్ కళ్యాణ్ తమ పార్టీని టార్గెట్ చేసుకోవడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన వెనుక ఎవరో ఉన్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఆధారాలు లేకుండా తమ పార్టీపై, మంత్రి నారా లోకేష్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయవద్దన్నారు.
చదవండి: ఓటుకు నోటు నుంచి భయం దాకా: ఏకేసిన పవన్పై సుజన నో, దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం
నాలుగేళ్లుగా బయటకు వచ్చినా
గత నాలుగేళ్లుగా పవన్ ఏపీలోని సమస్యలు, ప్రత్యేక హోదాపై పదేపదే స్పందిస్తున్నారు. ఇన్నాళ్లు సినిమాలకు పరిమితమైన ఆయన సోషల్ మీడియాలో, అప్పుడప్పుడు సమావేశాలతో ప్రభుత్వాలను నిలదీశారు. ఒకటి రెండుసార్లు చంద్రబాబుపై, టీడీపీపై నిప్పులు చెరిగినా అంత ఘాటుగా కనిపించలేదు.
ఇప్పుడు ఉతికి ఆరేశారు
అమరావతిలో రైతుల భూములు మొదలు ఎన్నో సమస్యలపై ఆయన చంద్రబాబును నిలదీశారు. కానీ నిన్నటి వరకు సున్నితంగా నిలదీసిన ఆయన గుంటూరు సభలో చంద్రబాబును ఉతికి ఆరేశారు. గతంలో ఒకటి రెండుసార్లు ఘాటుగా మాట్లాడినా చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారని, ఆయనకు రాజకీయంగా ఇబ్బంది వచ్చినప్పుడు ఉద్దేశ్యపూర్వకంగా బయటకు వస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.
నిన్న జగన్.. నేడు తెలుగుదేశం
కానీ, ఇప్పుడు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో తెలుగుదేశం పార్టీకి కొత్త అనుమానాలు వస్తున్నాయి. ఆయన వెనుక ఎవరో ఉన్నారని వారు భావిస్తున్నారు. ఇన్నాళ్లు పవన్ బయటకు వచ్చినప్పుడు వైసీపీ నేతలు ఆయన వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు.
ఎదురు తిరగడంతో కొత్త అనుమానాలు
ఇప్పుడు పవన్ ఎదురు తిరగడంతో టీడీపీకి కొత్త అనుమానాలు వస్తున్నాయి. ఆయన వెనుక మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఉండి ఉంటారని కొందరు తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ఇటీవల పవన్ జేఎఫ్సీని ఏర్పాటు చేశారు. ఇందులో ఉండవల్లికి చోటు లభించింది. అప్పటి నుంచే టీడీపీకి అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు. పవన్ స్క్రిప్ట్ వెనుక ఉండవల్లి ఉన్నారని కొందరు టీడీపీ కార్యకర్తలు బుధవారం విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నినాదాలు చేశారు.
పవన్ వ్యాఖ్యల వెనుక
పవన్ వ్యాఖ్యల వెనుక బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో ఏది ఉందో తెలుసుకుంటామని జూపూడి ప్రభాకర రావు అనడం గమనార్హం. మోడీ, జగన్లను పవన్ అనలేదని టీడీపీనే టార్గెట్ చేశారని గుర్తు చేస్తున్నారు. బీజేపీతో పవన్ రహస్య ఒప్పందం ఏమిటో బయటపెట్టాలని మంత్రి జవహర్ అన్నారు. విశాఖలో భూకబ్జా విషయాలు బీజేపీ విష్ణు కుమార్ రాజు చెప్పారా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి పవన్ వెనుక ఉండవల్లి, జగన్ లేదా జగన్, బీజేపీలు ఉన్నారని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు.
ఆగస్ట్ 14న జనసేన మేనిఫెస్టో
కాగా, ఆగస్ట్ 14న జనసేన మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు పవన్ ప్రకటించారు. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం ప్రత్యేక నెంబర్ 9394022222 కేటాయించినట్లు తెలిపారు. దీనికి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా జనసేనలో చేరవచ్చన్నారు. ఈ ఉగాది వేడుకలను అమరావతిలోనే జరుపుకుంటానని చెప్పారు.