ఎస్వీబీసీ ఛైర్మన్ రేసులో ముగ్గురు.. జగన్ మదిలో ఎవరున్నారు..? ఆమెకే పదవి దక్కుతుందా?
లైంగిక వేధింపుల ఆరోపణలతో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పృథ్వీ స్థానంలో ఎవరిని నియమించబోతున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీ,ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి కోసం ప్రధానంగా ముగ్గురి పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరా ముగ్గురు..? ముగ్గురిలో ప్రభుత్వం ఎవరి వైపు మొగ్గే అవకాశం ఉంది..?
ఎవరా ముగ్గురు :
ప్రస్తుతం 10టీవీ చానెల్కి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ప్రముఖ యాంకర్ స్వప్న, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ప్రముఖ సినీ దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి పేర్లను ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి కోసం ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ముగ్గురిలో ఎవరికి దక్కే అవకాశం :
యాంకర్ స్వప్నకు చాలాకాలంగా సాక్షి టీవితో మంచి అనుబంధం ఉంది. జగన్ కుటుంబానికి సన్నిహితురాలు అనే పేరు కూడా ఉంది. ప్రస్తుతం ఎస్వీబీసీ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. పృథ్వీపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో.. ఎస్వీబీసీ ఛైర్మన్గా మహిళను నియమిస్తే భవిష్యత్లో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి దాదాపుగా స్వప్నకే దక్కవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మిగతా ఇద్దరిలో..
ఇక మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో టీటీడీలో పనిచేయడం ఆయనకు అదనపు బలం. బీజేపీ నేతగా కొనసాగుతున్నప్పటికీ.. వైసీపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. గతేడాది ఆయన వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగినప్పటికీ.. అనూహ్యంగా ఆయన బీజేపీలో చేరారు. తాజాగా సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనకు కూడా మద్దతునిచ్చారు. ఈ నేపథ్యంలో ఐవైఆర్ పేరును కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రభుత్వ పరిశీలనలో దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి పేరు కూడా ఉంది. ఢమరుకం, కుబేరులు, టాటా బిర్లా మధ్యలో లైలా వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. పైగా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులు. ప్రస్తుతం ఎస్వీబీసీ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి శ్రీనివాస్ రెడ్డికి దక్కే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం.
జగన్ ఎటువైపు మొగ్గుతారు..:
ఎస్వీబీసీ ఛైర్మన్ రేసులో ముగ్గురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి జర్నలిస్టు స్వప్న వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో దీనిపై ఫోన్లో చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. ఎస్వీబీసీ ఛైర్మన్గా మహిళకు అవకాశం ఇవ్వడం ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకువస్తుందనే ఆలోచనలో జగన్,వైవీ సుబ్బారెడ్డి ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద రేపో.. మాపో.. దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.