ఎవడండీ ప్రధాని?.. వాడికెంత ధైర్యం??: తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 29సార్లు ఢిల్లీకి వెళితే.. మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వని విషయాన్ని చంద్రబాబునాయుడే స్వయంగా వెల్లడించడం అత్యంత బాధాకరమని, ఇది తెలిసిన తరువాత ఒక తెలుగువాడిగా తన ఆత్మగౌరవం దెబ్బతిందని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ఈ విషయంలో కేవలం తన ఆత్మగౌరవం మాత్రమే కాదని, ప్రతి తెలుగోడి ఆత్మగౌరవం దెబ్బతిందన్నారు. ఒకవేళ మోడీ అన్నిసార్లు తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా.. చంద్రబాబు ఆ మాట బయటికి చెప్పుకోకుండా ఉండాల్సిందని అన్నారు.
ఇది దారుణం కాదా?
‘ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 29సార్లు ఢిల్లీకి వెళితే.. మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదట. ఇది ఎంత దారుణం.. దీన్ని ఎవరైనా చెప్పుకుంటారా? నిజంగా చంద్రబాబుకి ఆత్మగౌరవం ఉండి ఉంటే ఒకసారి రెండుసార్లు చూసి అప్పుడే ఎన్డీఏకి గుడ్బై చెప్పి బయటకు వచ్చేసి ఉండాల్సింది..' అని భరద్వాజ అభిప్రాయపడ్డారు.
29 సార్లు అవమానం....
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రధాని వద్దకు వెళితే అపాయింట్మెంట్ ఇవ్వారా? 29 సార్లు మా ముఖ్యమంత్రి వెళితే పట్టించుకోరా? ఎవడండీ ప్రధాన మంత్రి?.. సీఎంని లోపలికి రానీయకుండా ఉండటానికి.. వాడికి ఎంత ధైర్యం ఉండాలి? ప్రధాన మంత్రి ఎంత గొప్పోడైనా కావచ్చు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలా అవమానిస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
ఏడాదిన్నర కాలం లోపలికే రానీయలేదంటే...
ఏడాదిన్నర కాలం మా ముఖ్యమంత్రిని లోపలికి రానీయకుండా చేశారంటే ఏమనాలి? ఆ ముఖ్యమంత్రి ఎవరు? మేం ఓటేసి గెలిపించుకున్నాం.. ఆయన్ని అవమానించారంటే.. ఆ అవమానం ఆయనొక్కరిదే కాదు.. మమ్మల్నీ అవమానించినట్టే. మాకు జరిగిన ఈ అవమానానికి నువ్ ఏం సమాధానం చెప్తావ్?.. అంటూ ప్రధానిని ప్రశ్నించారు తమ్మారెడ్డి.
ఏన్డీఏలో కొనసాగాల్సిన అవసరం ఏమిటి?
ఒకవేళ మోడీ అన్నిసార్లు తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా.. చంద్రబాబు ఆ మాట బయటికి చెప్పుకోకుండా ఉండాల్సింది, అంతేకాదు, అంతటి దారుణమైన పరిస్థితుల్లో కూడా ఏన్డీఏ ప్రభుత్వంలో కొనసాగాల్సిన అవసరం ఏముంది? అప్పుడే ఆ కూటమిలోంచి ఎందుకు టీడీపీ బయటికి రాలేదు? ఇదే తాను ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏం సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు తమ్మారెడ్డి భరద్వాజ.