మీరా.. నేనా, మీ నాన్నే చెప్పారు: నారా లోకేష్కు వీడియోతో పవన్ కళ్యాణ్ ఝలక్
హైదరాబాద్: రూ.500, రూ.1000 నోట్లు రద్దయి రెండేళ్లవుతోంది. 2016 నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు ప్రకటన చేశారు. అప్పుడు దీనిపై ప్రతిపక్షాలు విమర్శించగా, చాలామంది సమర్థించారు. నోట్ల రద్దుకు రెండేళ్లయిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. గతంలో తాను ఈ అంశంపై చేసిన వ్యాఖ్యల మీద మీడియాలో వచ్చిన వార్తలకు సంబంధించిన లింక్స్ను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు.
నోట్ల రద్దుకు రెండేళ్లు: అది మా లక్ష్యం కాదు.. అరుణ్ జైట్లీ ఏం చెప్పారంటే?
నోట్ల రద్దుపై జనసేనాని చేసిన వ్యాఖ్యలపై పలు వెబ్ ఛానల్స్ వార్త రాశాయి. ఇందుకు సంబంధించిన ఆరు లింక్లను పవన్ పోస్ట్ చేశారు. ఇందులో వన్ ఇండియా ఇంగ్లీష్ లింక్ కూడా ఉంది. నోట్ల రద్దుపై పవన్ తీవ్ర ఆగ్రహం అని హెడ్డింగ్తో ఈ వార్త ఇంగ్లీష్లో ఉంది.
లోకేష్, చంద్రబాబులకు దిమ్మ తిరిగే కౌంటర్
నరేంద్ర మోడీకి అనుకూలంగా పవన్ కళ్యాణ్ ఉన్నారని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వీటికి కౌంటర్గా, సందర్భోచితంగా నోట్ల రద్దు జరిగి రెండేళ్లయిన నేపథ్యంలో పవన్ ఈ పోస్టులు పెట్టారు. ఆ పోస్టులు పెట్టి టీడీపీని, చంద్రబాబును, లోకేష్ను ప్రశ్నించారు. అప్పుడు నోట్ల రద్దును, మోడీని సమర్థించింది ఎవరు అని నిలదీశారు.
సమర్థించింది మీరా, నేనా?
రెండేళ్ల క్రితం నోట్ల రద్దు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడినప్పుడు, క్యూ లైన్లో నిలబడి తీవ్ర అవస్థలు పడినప్పుడు తాను మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించానని, అదే సమయంలో నీవు (లోకేష్), మీ తండ్రి (చంద్రబాబు) మాత్రం బీజేపీ నేతలపై ప్రశంసలు కురిపించారని ఆ పోస్టులో పేర్కొన్నారు. అప్పుడు బీజేపీని సమర్థించింది మీరా.. నేనా అని నిలదీశారు. ఇక్కడ లింక్స్ పెట్టాను కావాలంటే చెక్ చేసుకోండి అన్నారు.
నా ఐడియానే అని చంద్రబాబే చెప్పారు
రెండేళ్ల క్రితం నోట్ల రద్దు జరిగినప్పుడు చంద్రబాబు సమర్థించడమే కాకుండా, ఈ ఆలోచన తనదేనని డబ్బా కొట్టుకున్నారని పవన్ అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించిందని గుర్తు చేశారు. కేవలం జనసేన మాత్రమే నిజం మాట్లాడిందని, నోట్ల రద్దుకు వ్యతిరేకంగా మాట్లాడిందని పేర్కొన్నారు.
వీడియోతో చంద్రబాబుకు పవన్ కౌంటర్
నోట్ల రద్దుపై రెండేళ్ల క్రితం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను జనసేన శతఘ్ని పోస్ట్ చేయగా, జనసేన రీట్వీట్ చేసింది. నోట్ల రద్దుపై నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చంద్రబాబు చెప్పారని కూడా పేర్కొన్నారు.