ఎస్వీబీసీ ఛైర్మన్ రేసులో ఇద్దరు: ఇద్దరూ డైరెక్టర్లే: జగన్ మొగ్గు ఎవరివైపు..!
ప్రతిష్ఠాత్మకమైన టీటీడీలో భాగమైన ఎస్వీబీసీ ఛానల్ కొత్త ఛైర్మన్ పైన ఇప్పుడు చర్చ మొదలైంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ రాజ్ తన పదవికి రాజీనామా చేయటంతో కొత్తగా ఆ పోస్టు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటికే ఇద్దరు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, టీటీడీ ఛైర్మన్ అభిప్రాయం సైతం ఇందులో కీలకం కానుంది. మహిళల వేధింపుల ఆరోపణల కారణంగా పృథ్వీ తన పదవికి రాజీనామా చేసారు. ఇప్పటికే ఆ వ్యవహారం పైన టీటీడీ విజిలెన్స్ విచారణ నిర్వహిస్తోంది. అయితే, ఇదే సమయంలో ఛైర్మన రేసులో ఉన్న ఇద్దరూ డైరెక్టర్లే. దీని పైన సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ఇద్దరిలో ఒకరి పేరు వైపే ముఖ్యమంత్రి మొగ్గు చూపుతారని తెలుస్తోంది.
రేసులో ఇద్దరు డైరెక్టర్లు ..
పార్టీ కోసం పని చేస్తూ..విధేయుడిగా వ్యవహరించిన పృథ్వీ ఎస్వీబీసీ పదవికి రాజీనామా చేయటంతో ఇప్పుడు పార్టీ నేతకు ఈ పదవి ఇస్తారా..లేక ప్రస్తుతం అందులో పని చేస్తున్న వారికే ప్రాధాన్యత ఇస్తారా అనేది చర్చకు కారణమైంది. పృథ్వీ రాజీనామా చేయగానే రెండు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. రేసులో ఉన్న ఇద్దరూ ప్రస్తుతం ఎస్వీబీసీలో డైరెక్టర్లుగా ఉన్నవారే. ఒకరు టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కాగా.. మరొకరు తెలుగులో మీడియాలో పేరుగాంచిన యాంకర్ స్వప్న. ఇద్దిరి పేర్లు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. దర్శకుడిగా పేరున్న శ్రీనివాసరెడ్డి ఎస్వీబీసీలోనూ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. జగన్ సీఎం అయిన వెంటనే ఆయనకు కీలక పదవి దక్కుతుందని అప్పట్లోనే భావించారు. అయితే, ఆయన్ను ఎస్వీబీసీ డైరెక్టర్ గా నియమించారు.
ప్రచారంలో స్వప్న పేరు..
ప్రస్తుతం ఎస్వీబీసీ డైరెక్టర్ వ్యవహరించటంతో పాటుగా జగన్ మీడియా గ్రూపులో కీలకంగా పని చేసిన యాంకర్ స్వప్న సైతం పోటీలో ఉన్నారు. వైఎస్సార్సీపీ పార్టీ విజయంలో స్వప్న కూడా జర్నలిస్ట్ గా ప్రముఖ పాత్ర పోషించారు.అందుకే 10టీవీలో పనిచేస్తున్న ఆమెను ముఖ్యమంత్రి జగన్ ఎస్వీబీసీ డైరెక్టరు గా అవకాశం కల్పించారు.సంగీతం, సాహిత్యం తో పాటు వివిధ భాషలపై పట్టు ఉన్న స్వప్నకు ఇవ్వటం ద్వారా..మహిళకు టీటీడీ సంస్థల్లో కీలక స్థానం కల్పించినట్లువుతుందని విశ్లేషణలు వస్తున్నాయి. దీంతో..ఈ ఇద్దరి ప్రస్తుత డైరెక్టర్లలో ఒకరు ఛైర్మన్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఇద్దరిలో ఒకరికి డైరెక్టర్ పదవితో పాటు చైర్మన్ పదవిని కూడా ఆయనకే కట్టబెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.
జగన్ మొగ్గు ఎవరి వైపు..
ఇద్దరూ కావాల్సిన వారే కావటం..ఇద్దరూ ఇప్పుడు ఎస్వీబీసీ డైరెక్టర్లు ఉండటంతో ముఖ్యమంత్రి తుది నిర్ణయం ఎవరికి వరంగా మారుతుందనేది ఆసక్తి కరంగా మారింది. శ్రీనివాస్ రెడ్డి తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితులే. ఢమరుకం, కుబేరులు, టాటా బిర్లా మధ్యలో లైలా తో పాటు పలు సినిమాలను ఆయన తెరకెక్కించారు. ప్రస్తుతం.. భార్యదేవోభవ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే విధంగా వైయస్సార్ కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. ఇక, స్వప్న విషయంలోనూ సాఫ్ట్ కార్నర్ ఉండటంతో పండుగ రోజుల్లోనే జగన్ ఎస్వీబీసీ నూతన ఛైర్మన్ ను ఖరారు చేసే అవకాశం ఉంది.