గీత దాటితే చర్యలు: ఫొటోలు, విగ్రహాలు బ్యాన్, వీరికి మాత్రం మినహాయింపు: ఏపీ ఎన్నికల కమిషనర్
ఆంధ్రప్రదేశ్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగబోతున్నందున నిబంధనలకు లోబడి పార్టీలు, నేతలు వ్యవహరించాలని సూచించింది. గీత దాటితే చర్యలు తప్పవని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వ నిధులతో నాయకుల ఫొటోలు, సందేశాలను ప్రదర్శించొద్దని తేల్చిచెప్పింది.
విగ్రహాలు, ఫొటోలు బ్యాన్..
ప్రస్తుతం బతికున్న నేతల విగ్రహాలు, ఫొటోలను కూడా ప్రదర్శించొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేశ్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ప్రభుత్వ అధికార వెబ్సైట్ ద్వారా కూడా ప్రచారం చేయొద్దని స్పష్టంచేశారు. ప్రభుత్వ భవనాలపై చిత్రాలు ఉంచొద్దని.. ఎన్నికల నిబంధనలను పాటిస్తూ సహకరించాలని కోరారు. గీత దాటితే నియామావళి మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఇందులో సందేహానికి తావులేదని చెప్పారు.
వెబ్సైట్ కూడా..
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రూపొందించిన విగ్రహాలు, ఫోటోలు, సందేశాలపై కూడా నిషేధం అమల్లో ఉంటుందని రమేశ్ కుమార్ వెల్లడించారు. ప్రభుత్వ వెబ్సైట్లలో మంత్రులు, నేతలు, రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫోటోలు తొలగిస్తామని చెప్పారు. అన్ని పార్టీలకు చెందిన నేతల ఫోటోలను తొలగిస్తామని స్పష్టంచేశారు. హోర్డింగుల్లో ఉన్న ప్రకటనల్లో ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా ఉంటే తీసివేస్తామని తేల్చిచెప్పారు.
వీరికి మినహాయింపు
రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న నేతల విగ్రహాలు ప్రభుత్వ నిధులతో నిర్మిస్తే.. వెంటనే తొలగిస్తామని పేర్కొన్నారు. అయితే చనిపోయిన నేతల ఫేస్ కవర్ చేయాల్సిన అవసరం లేదు అని అభప్రాయపడ్డారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, రాజకీయ నేతల ఫోటోలపై మాత్రం నిషేధం ఉందని చెప్పారు. వీరి వల్ల సంబంధిత రాజకీయ పార్టీకి ప్రయోజనం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ భవనాలు, ప్రాంగణాల్లో ఫోటోలను ఉంచొద్దని తేల్చిచెప్పారు. కానీ కవులు, ప్రముఖ వ్యక్తులు, రాష్ట్రపతి, గవర్నర్ ఫోటోలకు మాత్రం మినహాయింపు ఉందని స్పష్టంచేశారు.