ఎమ్మెల్యే టిక్కెట్ కోసం వైసీపీలో నాయకుల మధ్య మొదలైన కుమ్ములాట!
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ నాయకుల మధ్యన అప్పుడే కుమ్ములాట మొదలైంది. ఎమ్మెల్యే టికెట్ ద్వారంపూడికి దక్కుతుందా..? లేక వైసీపీ అధిష్టానం సూర్యనారాయణరెడ్డికే ఇస్తుందా..?
అమరావతి: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ నాయకుల మధ్యన అప్పుడే కుమ్ములాట మొదలైంది. ఎమ్మెల్యే టికెట్ ద్వారంపూడికి దక్కుతుందా..? లేక వైసీపీ అధిష్టానం సూర్యనారాయణరెడ్డికే ఇస్తుందా..? అన్నది ఇప్పుడు చర్చగా మారింది.
ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే సూర్యనారాయణరెడ్డి రెబల్గా దిగుతారా? అనే విషయంపై కూడా ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. దీంతో అనపర్తి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రెడ్డి సామాజిక వర్గానిదే పైచేయి...
కడప తరువాత రెడ్డి సామాజికవర్గం అత్యధికంగా ఉన్న ఏకైక నియోజకవర్గం.. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గమే. ఇక్కడ్నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే ఎన్నో ఏళ్లుగా విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి తల్లి విజయలక్ష్మి ఇక్కడ్నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగినా ఆ తరువాత ఆమె ఎందుకో విరమించుకున్నారు. చివరికి ఈ స్థానం డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డికి దక్కింది.
డాక్టర్ గారికి మంచిపేరే ఉంది...
వృత్తిరీత్యా డాక్టర్ అయిన సూర్యనారాయణరెడ్డికి స్థానికంగా మంచి పేరుంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఈయన గట్టి పోటీనిచ్చారు కానీ స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. అప్పట్నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీకి సేవలందిస్తూ వస్తున్నారు.. కోఆర్డినేటర్గా పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారు. గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని కార్యకర్తలతో కలిసి నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాన్ని మనసుల్లోంచి తుడిచేసి .. విజయం ధీమాతో ముందుకు సాగుతున్నారు సూర్యనారాయణరెడ్డి.
ద్వారంపూడి రాకతో...
గత మూడేళ్లుగా ఏక నాయకత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు జరుగుతున్న తరుణంలో తాజాగా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి సీన్లోకి వచ్చారు. అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ రేసులో చంద్రశేఖర్రెడ్డి కూడా ఉన్నారంటూ కార్యకర్తలలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో సూర్యనారాయణరెడ్డి వర్గంలో కలకలం మొదలయ్యింది. ఈ పరిణామాలు కాస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్లో కుమ్ములాటలకు దారితీశాయి..
తాడోపేడో తేల్చుకోవాలని...
ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డికే టికెట్ అన్న ప్రచారంతో పార్టీ క్యాడర్ రెండు గ్రూపులుగా చీలిపోయింది.. జగన్మోహన్రెడ్డికి చంద్రశేఖర్రెడ్డి అత్యంత సన్నిహితులు.. ఆ సాన్నిహిత్యంతోనే అనపర్తి టికెట్ను చంద్రశేఖర్ అడిగారనీ.. జగన్ కూడా మాట ఇచ్చారనీ పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.. దీంతో సూర్యనారాయణరెడ్డిలో ఆందోళన మొదలైంది. ఎమ్మెల్యే టికెట్ వ్యవహారంపై ఇక తాడోపేడో తేల్చుకోవాలని ఆయన భావిస్తున్నారు.
ఈ కుమ్ములాట టీడీపీకి లాభిస్తుందా?
ఈ విషయమై పార్టీ సీనియర్ నేతలతో సూర్యనారాయణరెడ్డి ఇప్పటికే చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమస్య అంత తేలిగ్గా పరిష్కరామయ్యేది కాదనే చర్చ జరుగుతోంది. ఒకవేళ సూర్యనారాయణరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కాకపోయినా.. మరో కీలక పదవిని కట్టబెట్టేందుకు అధిష్టానం ప్రయత్నించినా ఆయన దీనికి అంగీకరిస్తారా? అన్నది కూడా సందేహమే అంటున్నారు వారు! అధిష్టానం తీసుకునే నిర్ణయానికి సూర్యనారాయణరెడ్డి కట్టబడి ఉంటారా? లేక ఎన్నికలలో రెబెల్గా బరిలో దిగుతారా ? అన్నదానిపై కూడా పార్టీ వర్గాలలో తెగ చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీలో
మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోన్న ఈ కుమ్ములాటను తెలుగుదేశం పార్టీ నిశితంగా గమనిస్తోంది.. సూర్యనారాయణరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి మధ్య ఏర్పడిన వివాదం తమకు ఏ రకంగా లాభిస్తుందో లెక్కలు వేసుకుంటోంది.. తగు వ్యూహాలను రచించుకుంటోంది.. గత ఎన్నికలలో స్వల్ప మెజారిటీతో గెలిచిన టీడీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి ఈసారి భారీ మెజారిటీ సాధించాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు. రాజమహేంద్రవరం లోక్సభ నియోజకవర్గం ఫలితంపై తీవ్ర ప్రభావం చూపే అనపర్తి నియోజకవర్గాన్ని వచ్చే ఎన్నికల నాటికి మరింత పటిష్టం చేయాలనుకుంటోంది టీడీపీ. ప్రత్యేకించి ఈ నియోజకవర్గంపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా దృష్టి సారించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇద్దరు వైసీపీ నాయకుల్లో ఎవరు ఎమ్మెల్యే టిక్కెట్ దక్కించుకుంటారో వేచి చూడాల్సిందే!