బాబు హామీ: జగన్కు ఝలకిచ్చిన జలీల్కు షాకేనా, భూమా వెయిటింగ్?
విజయవాడ: గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ముస్లీం మైనార్టీ వర్గానికి చెందిన నేతలు ఎమ్మెల్యేగా గెలుపొందలేదు. వైసిపి నుంచి గెలిచిన ఇద్దరు మైనార్టీ ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, చాంద్ బాషాలు ఇటీవల టిడిపిలో చేరారు.
వీరిలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. గత కొద్ది రోజులుగా వైసిపి నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. మంత్రి పదవి కోసం కొందరు, నియోజకవర్గ అభివృద్ధి పేరుతో మరికొందరు, ఇలా పలు కారణాలతో చేరుతున్నారు.
వైసిపి నుంచి వచ్చిన ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి దక్కనుందని తొలి నుంచి ఊహాగానాలు ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రధానంగా భూమా నాగిరెడ్డి పేరు, జలీల్ ఖాన్ పేర్లు వినిపిస్తున్నాయి. జలీల్ ఖాన్ పేరు మైనార్టీ శాఖకు వినిపిస్తోంది.
జలీల్ ఖాన్ చేరిన కొన్నాళ్లకు కదిరి ఎమ్మెల్యే చాంద్ భాషా కూడా సైకిల్ ఎక్కారు. జలీల్ ఖాన్తో పాటు చాంద్ బాషాకు కూడా టిడిపి మంత్రి పదవి ఆఫర్ ఇచ్చిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో జలీల్ ఖాన్కు షాక్ తగలనుందా, లేక చాంద్ బాషాకు షాక్ తగులుతుందా అనే చర్చ సాగుతోంది. మంత్రి పదవిపై ఇటు జలీల్ ఖాన్కు, అటు చాంద్ బాషాకు హామీ ఇచ్చారని అంటున్నారు.
మరోవైపు, భూమా నాగిరెడ్డి తదితరులు మంత్రి పదవి ఆఫర్తో టిడిపిలో చేరారనే వాదనలు ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు మంత్రి వర్గ విస్తరణ పైన ఎలాంటి వార్తలు లేవు. ఈ నేపథ్యంలో భూమా నాగిరెడ్డి వెయిటింగ్ ఇంకెంత కాలం కొనసాగతుందోననే చర్చ సాగుతోంది.