బిజెపి ఎక్కడుంది, ఎవరైనా ఓటేస్తారా, అందుకే కేంద్రంపై తిరుగుబాటు చేశా: చంద్రబాబు సంచలనం
అమరావతి: బిజెపిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి విరుచుకుపడ్డారు.రాష్ట్రంలో బిజెపి ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. బిజెపి రాష్ట్రంలో లేనేలేదన్నారు. పక్క పార్టీల అండ చూసుకొని బిజెపి ఎగిరెగిరి పడుతుందని చంద్రబాబునాయుడు తీవ్రమైన విమర్శలు చేశారు.రాష్ట్రానికి ఇచ్చిన హమీలు అమలు చేయకుండా మోసం చేసిన విషయం తెలియగానే కేంద్రంపై తిరుగుబాటు చేసినట్టు ఆయన చెప్పారు.
Recommended Video
ఏపీకి ప్రత్యేక హోదా విషయమై రాష్ట్రంలో అధికార టిడిపి, విపక్ష వైసీపీలతో పాటు ప్రధాన పార్టీలు పోటీలు పడి ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ప్రత్యేక హోదా విషయమై బిజెపితో టిడిపి తెగదెంపులు చేసుకొంది. బిజెపితో తెగతెంపులు చేసుకొన్న తర్వాత ఆ పార్టీపై చంద్రబాబునాయుడు మరోసారి నిప్పులు చెరిగారు.
విజయవాడలో జరిగిన మహత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబునాయుడు బిజెపిపై ఘాటైన పదజాలంతో విమర్శలు చేశారు. బిజెపికి ఏపీ రాష్ట్రంలో ఉనికే లేదన్నారు.
బిజెపి ఉనికెక్కడుంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి ఎక్కడుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఏ ప్రాంతంలో బిజెపి ఉందని ఆయన ప్రశ్నించారు. బిజెపి ఎక్కడుందని జ్యోతిరావు పూలే జయంతి సభలో సభికులను ఆయన ప్రశ్నించారు. పక్క పార్టీ అండ చూసుకొని బిజెపి ఎగిరెగిరిపడుతుందని బాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఉనికే లేదన్నారు. ప్రస్తుతం బిజెపికి ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడ టిడిపితో పొత్తు కారణంగానే వచ్చినవని ఆయన చెప్పారు.
బిజెపికి ఓటేస్తారా
ఏపీ రాష్ట్రంలో బిజెపికి ఎవరైనా ఓటేస్తారా అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. జ్యోతిరావుపూలే జయంతి సభలో ఆయన సభికులను ప్రశ్నించారు. ఏపీకి బిజెపి అన్యాయం చేసిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బిజెపి అన్యాయం చేసిందన్నారు. ఈ తరుణంలో బిజెపికి ఓటేస్తారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి చేసిన అన్యాయం చేసిన బిజెపికి బుద్ది చెప్పాలని ఆయన ప్రజలను కోరారు.
ప్యాకేజీకి అందుకే ఒప్పుకొన్నా
ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీని ఇస్తామని ప్రధానమంత్రి మోడీ చెప్పారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. అందుకే తాను ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొన్నానని చంద్రబాబునాయుడు చెప్పారు. కానీ, ఇచ్చిన హమీని మోడీ ఇంతవరకు కూడ అమలు చేయలేదని బాబు చెప్పారు. ఇచ్చిన హమీని అమలు చేయకుండా ఏపీ రాష్ట్రాన్ని కేంద్రం మోసం చేసిందన్నారు.
కేంద్రంపై తిరుగుబాటు
ఏపీకి ఇచ్చిన హమీని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేసిన విషయాన్ని గుర్తించిన వెంటనే కేంద్రంపై తిరుగుబాటు చేసినట్టుగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఏపీ రాష్ట్రాభివృద్ది కోసం అలుపు లేకుండా కష్టపడుతున్నట్టు ఆయన చెప్పారు. కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రజలు ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. కర్ణాటకలో ఎన్నికలు ఉన్నందునే కేంద్రం కావేరీ బోర్డును ఏర్పాటు చేయలేదన్నారు. ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం సరైందికాదన్నారు.
వైసీపీ పోరాటంలో చిత్తశుద్ది లేదు
వైసీపీ పోరాటంలో చిత్తశుద్ది లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. కేంద్రంతో రాజీపడి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. రాజీనామాల పేరుతో వైసీపీ నేతలు ప్రజలకు నామాలు పెడుతున్నారన్నారు. వైసీపీ ఎంపీలవి నిజమైన రాజీనామాలు కావన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేవరకు విశ్రమించబోనని ఆయన చెప్పారు.